SGSTV NEWS
Crime

” పోసానికి స్క్రిప్ట్‌ ఎవరిచ్చినా…. అనుభవించేది ఆయనే ” : మంత్రి అనిత



అనంతపురం :” పోసానికి స్క్రిప్ట్‌ ఎవరిచ్చినా…. అనుభవించేది ఆయనే ” అని హోం మంత్రి అనిత అన్నారు. శనివారం అనంతపురంలో నిర్వహించిన ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌ ముగిసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ … తప్పు చేస్తే ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చెప్పారు. వైసిపి నేత, నటుడు పోసాని కఅష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో పోసాని మాటలను సమర్థించే వాళ్లు ఒక్కరైనా ఉన్నారా ? అని ప్రశ్నించారు. అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్‌.. తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలని సూచించారు. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల మాధవ్‌ను హెచ్చరిస్తున్నానని మంత్రి అనిత అన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే కుదరదు అని, ఇక్కడ ఉన్నది వైసిపి ప్రభుత్వం కాదు.. కూటమి ప్రభుత్వం అని మండిపడ్డారు. ఏది పడితే అది మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అని ధ్వజమెత్తారు. రెడ్‌ బుక్‌ ప్రకారం …. తాము ముందుకెళితే వైసిపి నేతలెవరూ రోడ్లపై తిరగలేరు అని హెచ్చరించారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదనీ, అలా అని తప్పు చేసిన వాళ్లని ఉపేక్షించేది లేదు అని చెప్పారు. చేసిన తప్పులకు శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అన్నారు. పోసానికి స్క్రిప్ట్‌ ఎవరిచ్చినా…. అనుభవించేది ఆయనే అని స్పష్టం చేశారు. గత వైసిపి ప్రభుత్వం పోలీసులకు రూ.900 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిందని మంత్రి అనిత తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.250 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు. అమరావతిలో ఉందన్న ఒకే ఒక కారణంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం చేపట్టిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్మాణాన్ని గోడలకే పరిమితం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ పాపాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ వస్తున్నామన్నారు. హోం శాఖలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమేననీ, త్వరలోనే నియామకాలు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి అనిత చెప్పారు.

Also read

Related posts

Share this