October 1, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Tirupati Laddu Row: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లడ్డూ కల్తీ కేసుపై సిట్ విచారణ తాత్కాలికంగా నిలిపివేత..

తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.. మరోవైపు సుప్రీంకోర్టులో సైతం విచారణ జరుగుతోంది.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 3వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కాగా.. సోమవారం లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి తరపు లాయర్లు వాదించారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని ఇప్పిటికే కోర్ట్ కోరింది. గురువారం మధ్యాహ్నం దీనిపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సిట్ విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. వాస్తవానికి దర్యాప్తు ఆపాలని కోర్టు ఆదేశించలేదు. కానీ ప్రభుత్వ తరపు లాయర్ల సూచన మేరకు సిట్ విచారణ 3వ తేదీ వరకూ నిలిపివేస్తున్నట్టు డీజీపీ స్పష్టం చేశారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని.. సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఈ కేసు ఉన్న నేపథ్యంలో ఎక్కవ వివరాలు చెప్పలేమని తెలిపారు.


అయితే ఇప్పటిదాక సిట్ క్షేత్రస్థాయిలో కొంతమేర దర్యాప్తు చేపట్టింది. టీటీడీకి నెయ్యి సరఫరా అవుతున్న విధానం, వినియోగిస్తున్న తీరు లాంటి అంశాలపై సిట్ దర్యాప్తు చేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో 3న కేసు విచారణ జరుగుతుంది. ఆ తరువాత ధర్మాసనం డైరెక్షన్ మేరకు వ్యవహరిస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించిన డీజీపీ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 4 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో సెక్యూరిటీ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాలు, మొబైల్ డివైజ్ ద్వారా ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని.. ఆర్టీసీ అదనపు బస్సులు యాత్రికులకు అందుబాటులో ఉంటాయని.. డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు

Related posts

Share via