July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: ఆ హత్యల పాపం వాడిదే..! నమ్మకంగా ఉంటూ.. ఒకరి తరువాత ఒకరిని..!

ఒకే ఒక్కడు.. సింగిల్ గా ఉంటాడు.. అధిక ఆదాయం కోసం ఆశ పడే యువకులనే టార్గెట్ చేస్తాడు. తాను చెప్పినట్టు చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదన మీ సొంతం అంటూ నమ్మబలికి ట్రాప్ చేస్తాడు. డబ్బులు తెచ్చే వరకు నమ్మకంగా ఉంటూ.. వచ్చాక హత్య చేసి ఆ నగదుతో పారిపోతాడు. ఇలా హత్యలు చేసి ఆధారాలు అంతు చిక్కకుండా పారిపోయాడు ఈ సీరియల్ కిల్లర్. ఎట్టకేలకు.. వాడి పాపం పడడంతో పోలీసులకి చిక్కాడు.. దీంతో ఒకటి కాదు రెండు కాదు మరిన్ని హత్యలు వెలుగులోకి వచ్చాయి

అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన పి.ఉపేంద్ర.. జల్సాల కోసం ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. అందులో భాగంగా నేరాలను ప్రారంభించాడు. చోరీలు, మోసాలు అయితే ఏమో… డబ్బుల కోసం ఏకంగా హత్యలకు పాల్పడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకు అతని ఖాతాలో ఐదు హత్యలు చేరాయి.

అచ్చుతాపురంలోని ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు ఉపేంద్ర. తన టార్గెట్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేస్తున్న మాకవరపాలెం మండలం జడ్. గంగవరంనకు చెందిన రుత్తల శివ శంకర్‌తో ఉపేంద్రకు పరిచయం ఏర్పడింది. అతన్ని మాయమాటలతో నమ్మించి ట్రాప్ చేశాడు. మాయమాటలు చెప్పి చాటుమాటు దందాకు తెరలేపాడు. రెండు లక్షల రూపాయలు తీసుకొస్తే.. లిక్విడ్ గంజాయి కొనుగోలు చేద్దామని నమ్మించాడు. దానిని అమ్మితే 4 నుంచి 5 రెట్లు లాభం సంపాదించవచ్చని నమ్మబలికాడు. దీంతో శివ శంకర్ ఎఫ్రిల్ నెల 29వ తేదీన రెండు లక్షలు పట్టుకుని ఊరి శివారుకు వచ్చాడు. అదను చూసిన ఉపేంద్ర.. శివ శంకర్ తలపై కర్రతో మోదీ హతమార్చి పారిపోయాడని పోలీసులు తెలిపారు.

కూపీ లాగితే.. బయటపడ్డ వాలంటీర్ హత్య కేసు..

శివ శంకర హత్య కేసులో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిందితుడు కోసం వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన లచ్చన్నపాలేనికి చెందిన వాలంటీర్ నడింపల్లి హరనాధ్ హత్య కేసు మిస్టరీ వీడింది. హరినాధ్‌ను కూడా ఉపేంద్ర ట్రాప్ చేసి హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. తన ప్లాన్ లో భాగంగానే ఉపేంద్ర.. హరినాధను నమ్మించాడు. అప్పటికే తన వద్ద ఉన్న పింఛన్ల సొమ్ముతో ఊరి బయటకు రప్పించి ఉపేంద్ర హత్య చేసినట్టు సిఐ హరి చెప్పారు

హత్య చేసి.. ఆధారాలు చిక్కాకుండా..

అయితే.. హత్య చేశాక ఆధారాలు దొరక్కుండా ఉపేంద్ర జాగ్రత్త పడుతున్నాడు. తనపై పోలీసులకు అనుమానం రాకుండా ఆధారాలు తారుమారు చేస్తున్నాడు. వాలంటీర్‌ను హత్య చేసిన ప్రాంతంలో గాజులు, కండోమ్ ప్యాకెట్లు వేసి, పోలీసులనూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడని పోలీసులు అంటున్నారు.

గతంలోనూ ఇదే తరహా హత్య…

కేవలం ఈ రెండు హత్యలే కాదు.. ఇదే తరహాలో 2022 అక్టోబర్ 12న మునగపాకకు చెందిన మహాలక్ష్మి నాయుడు అనే యువకుడిని మరో హత్య చేసి లక్ష రూపాయలకు పైగా నగదు తీసుకుని పరారయ్యాడు. ఒక హత్య కోసం కూపీ లాగితే మూడు హత్యలు బయటపడ్డాయి. అయితే ఉపేంద్ర అంతకుముందు కూడా వి. మడుగులలో రెండు హత్యలు చేసి జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడని, మళ్లీ మూడు హత్యలు చేయడం ప్రారంభించాడని సిఐ హరి వెల్లడించారు.

ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ ఉపేంద్ర అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share via