SGSTV NEWS
Andhra PradeshCrime

హైవేపై ట్యాంకర్ నుంచి వెలువడిన తెల్లటి వాయువు.. భయంతో జనం పరుగులు..!

అనకాపల్లి జిల్లాలోని జాతీయ రహదారి.. నిత్యం ఆ రూట్ లో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కలకలం. భారీ శబ్దంతో ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.. హైవేపై నుంచి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. వెంటనే తెల్లగా వాయువులు బయటకు వచ్చాయి.. దట్టంగా ఆ ప్రాంతమంతా కమ్మేసింది. దీంతో స్థానికులకు ఒకటే ఆందోళన. భయంతో పరుగు అందుకున్నారు.

యలమంచిలి మండలం రేగుపాలెం హైవే పై ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న TS 06 UC 0645 నంబరు గల గ్యాస్ ట్యాంకర్ రేగుపాలెం సమీపంలో అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న పిల్ల కాలువ వైపు లారీ పడిపోయింది. దీంతో ట్యాంకర్ నుంచి ఒకసారిగా భారీగా గ్యాస్ బయటకు వచ్చింది. తెల్లని గ్యాస్ పక్కనున్న పొలాలు, కాలువ వైపు దట్టంగా వ్యాపించింది. ఇది చూసిన ప్రయాణికులు, స్థానికుల్లో ఆందోళన రేగింది. భయంతో పరుగులు పెట్టారు. హుటాహుటిన పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. గ్యాస్ ను కంట్రోల్ చేశారు. అయితే లీకైన గ్యాస్ శీతల పానీయాల్లో ఉపయోగించే కార్బన్ డయాక్సైడ్‌గా లారీ డ్రైవర్, క్లీనర్ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also read

Related posts

Share this