SGSTV NEWS
Andhra PradeshCrime

బెడిసికొట్టిన పోలీస్‌ మార్క్‌ పంచాయతీ.. లారీ యజమాని ఏం చేశాడో తెలుసా?

పంచాయతీలు, ప్రైవేటు వ్యవహారాల జోలికి వెళ్ళవద్దని పోలీసు ఉన్నతాధికారులు ఎంత మొత్తుకుంటున్నా పోలీస్ స్టేషన్లలో సెటిల్‌మెంట్లతో కిందిస్థాయి పోలీసులు అంటకాగుతూనే ఉన్నారు. కాసుల కోసమో, రాజకీయపార్టీ నాయకుల మెప్పు కోసమో ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ పోలీసు శాఖ పరువును బజారున పడేస్తున్నారు. తాజాగా ఓ లారీ కొనుగోలు, అమ్మకం వ్యవహారంలో జోక్యం చేసుకుని వివాదంలో చిక్కుకున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. పోలీసుల వేధింపులు భరించలేక, తీవ్రంగా అవమానించారంటూ మనస్తాపంతో ఓ లారీ ఓనర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.


మార్కాపురం సిఐ సుబ్బారావు.. తీవ్రంగా వేధింపులకు గురి చేశాడని, ఈ అవమాన భారం భరించలేక మనస్తాపంతో గిద్దలూరుకు చెందిన కందుల సురేందర్‌ రెడ్డి సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో తమకు న్యాయం కావాలంటూ ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట సురేందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న తన భర్తకు వైద్య సహాయం అందించాలని సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన లారీ యజమాని కందుల సురేందర్‌ రెడ్డి పురుగుల మందు తాగుతూ సెల్ఫీ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో కలకలం రేపుతున్నాయి. మార్కాపురంకు చెందిన దేవిరెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తి నుంచి సురేందర్ రెడ్డి లారీ కొనుగోలు చేశాడు. లారీ డబ్బుల విషయంలో మార్కాపురం సిఐ సుబ్బారావు తనను పోలీస్ స్టేషన్‌కు పలుమార్లు పిలిపించి అవమానకరంగా మాట్లడమే కాకుండా తప్పుడు కేసులు పెడతానని బెదిరించడంతో సురేందర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మే 24వ తేదీన పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.


లారీ కొనుగోలు నిమిత్తం లారీ అమ్మిన సుబ్బారెడ్డికి లక్షన్నర రూపాయలు ఇచ్చానని, ఆ తరువాత లారీ మరమ్మత్తులకు, వాయిదాలకు మరికొంత డబ్బులు కట్టానని చెబుతున్నాడు. అదే సమయంలో తన స్వంత లారీ యాక్సిడెంట్‌కు గురై డ్రైవర్‌ చనిపోవడంతో సెంటిమెంట్‌గా ఫీలై, లారీ వెనక్కి ఇచ్చేస్తానని చెప్పాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు తనను లారీ యజమాని సుబ్బారెడ్డి, మార్కాపురం సిఐ సుబ్బారావుతో బెదిరింపులకు దిగి తీవ్రంగా అవమానించారని ఆరోపిస్తున్నాడు.

ఈ పరిణామంతో ఈనెల 24వ తేదీన పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు సురేందర్‌రెడ్డి. అతన్ని బంధువులు నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. సురేందర్‌ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణంగా మార్కాపురం పట్టణానికి చెందిన లారీ యజమాని సుబ్బారెడ్డి, మార్కాపురం సిఐ సుబ్బారావులే కారణమంటూ బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. యాక్సిడెంట్‌ అయిన లారీని కొనుగోలు చేసి నష్టపోయిన తాను వాయిదాలు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే, లారీ అమ్మిన సుబ్బారెడ్డి తన రాజకీయ బలంతో మార్కాపురం సిఐ సుబ్బారావుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పంచాయతీ పెట్టాడని చెబుతున్నారు.

ఇందుకు సంబంధించి మూడు రోజుల క్రితం తీసుకున్న ఈ వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తనకు జరిగిన అవమానం, న్యాయం జరగకపోవడంతో పురుగుల మందు తాగినట్లు పేర్కొన్నాడు. తనకు ఏమైనా జరిగితే మార్కాపురం సిఐ సుబ్బారావు, లారీ యజమాని సుబ్బారెడ్డిలే కారణమంటూ డీజీపీకి లేఖ రాశాడు సురేందర్ రెడ్డి.

ఇదిలావుంటే, గిద్దలూరులో ఇంట్లో పురుగుల మందు తాగిన సురేందర్‌ రెడ్డి విషయంలో కేసు నమోదు చేయాలని గిద్దలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సిఐ పట్టించుకోకుండా, అతను చనిపోతే అప్పుడు పెడతామని చెబుతున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భార్య విజయలక్ష్మి, సోదరుడు కందుల నరేందర్‌రెడ్డి సెల్ఫీ వీడియోలు తీసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లను ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు, ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన సురేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మార్కాపురం సిఐ సుబ్బారావు, లారీ యజమాని దేవిరెడ్డి సుబ్బారెడ్డి తీవ్రంగా వేధింపులకు గురి చేసినందున సురేందర్‌ రెడ్డి పురుగుల మందు తాగాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భర్త సురేందర్‌రెడ్డి నంద్యాల ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉండగా, చికిత్స చేయించేందుకు ఆర్ధిక ఇబ్బందులు పడుతూనే, మరోవైపు ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పిల్లలు కుటుంబ సభ్యులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తకు వైద్య సహాయం అందించాలని బాధితుడి భార్య విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు

Also read

Related posts

Share this