తిరుపతికి చెందిన వెంకటరమణ బాబు, లక్ష్మి కుమారి దంపతులకు వింత అనుభవం ఎదురయింది. ఈ ఇద్దరు దంపతులు ఇటీవల యూఎస్లో ఉన్న తమ పిల్లల వద్దకు వెళ్లి వచ్చేసరికి వారి ఇంటిని మొత్తం లూటీ చేశారు దొంగలు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు ఎత్తుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ దంపతులకు మరోషాక్ తగిలింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీరి నుంచి రూ.32 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తిరుపతికి చెందిన వెంకటరమణ బాబు, లక్ష్మి కుమారి దంపతులకు వింత అనుభవం ఎదురయింది. రాఘవేంద్ర నగర్లో నివాసం ఉంటున్న 68 ఏళ్ల వెంకటరమణ బాబు ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వహించి రిటైరయ్యారు. అయితే ఇటీవల అమెరికాలో ఉంటున్న తమ పిల్లల వద్దకు వెళ్లిన ఈ దంపతులు గత మే నెలాఖరులో తిరుపతికి తిరిగి వచ్చారు. గేటు తీసి ఇల్లు తాళం తీద్దామని వెళ్లగా తలుపులు తెరిచి ఉండడం చూసి వారు షాక్ అయ్యారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించిన వారు దొంగతనం జరిగినట్టు గుర్తించారు. గత నెల 29 న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు ఇంట్లో ఉన్న 3 బంగారు ఉంగరాలు, 3 బంగారు డాలర్లు, 2 లక్ష్మీకాసులు 350 గ్రాముల వెండి దీపం, 150 గ్రాముల వెండి ప్లేట్ ఇలా మొత్తం 50 గ్రాముల బంగారుతోపాటు అర కిలో వెండిని అపహరించుకుపోయినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు..
అయితే ఈ దొంగతనం నుంచి తేరుకునే లోకే ఆ దంపతులకు మరో షాక్ తగిలింది. వెంకటరమణ దంపతులను సైబర్ నేరగాళ్ల ముఠా టార్గెట్ చేసింది. ఇద్దరు అగంతకుల నుంచి వచ్చిన వీడియో కాల్స్ వారిని భయభ్రాంతులకు గురిచేసాయి. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి ఈస్ట్ పోలీసులను వెంకటరమణ బాబు ఆశ్రయించడంతో డిజిటల్ అరెస్ట్ వ్యవహారం వెలుగు చూసింది.
7609066722 ,9058943522 అనే ఫోన్ నెంబర్ల నుంచి ఈ నెల 4 న తమకు కొన్ని వీడియో కాల్స్ వచ్చాయని వెంకటరమణ పోలీసులు దృష్టికి తీసుకొచ్చారు. తాము బెంగుళూరు పోలీసులమని, సీబీఐ అధికారులమని తమకు తాముగా పరిచయం చేసుకున్న ఇద్దరు అగంతకులు తన భార్య లక్ష్మి కుమారి మానవ అక్రమ రవాణా కేసుల్లో ఉందని భయభ్రాంతులకు గురి చేసినట్టు వెంకట్రమణ తెలిపారు. డిజిటల్ అరెస్ట్ తప్పదని.. కేసుల నుంచి తప్పించేందుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు తెలిపాడు. దీంతో భయపడిపోయిన వెంకటరమణ వారికి ఈ నెల 9 నుంచి 11వ తేదీ మధ్యన మూడుసార్లు ఏకంగా రూ. 32 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు స్పందించకపోవడంతో ఇది సైబర్ మోసం అని గ్రహించిన వెంకటరమణ బాబు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో బి.ఎన్.ఎస్ 331(4), 305 సెక్షన్ల కింద తిరుపతి ఈస్ట్ పోలీసులు క్రైమ్ నెంబర్ 254/2025 కేసు నమోదు చేశారు.
Also read
- Andhra: ఉరి తప్పించినా – చావు మాత్రం తప్పలేదు – ఏం జరిగిందంటే..?
- Sextortion Racket : కిలాడీ ఆంటీలు. అందాలతో వల..ఆ తర్వాత..
- ట్రైన్లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే
- గరుడ పురాణం ప్రకారం .. ఈ మూడు తప్పులు చేస్తే అకాల మరణం తప్పదంట!
- రేపే యోగినీ ఏకాదశి.. విష్ణు పూజ.. ఉపవాసం సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..