SGSTV NEWS
Andhra PradeshCrime

వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని స్కెచ్ వేశారు.. కట్ చేస్తే.. లాస్ట్‌లో అసలు ట్విస్ట్ ఇదే!

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధ మహిళపై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కళ్ళల్లో కారం చల్లి ఒంటిపై ఉన్న ఆరున్నర లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్ళారు. తీరా చూస్తే ఆ ముగ్గురు దుండగులు అదే వీధిలో ఉంటున్న వారే కావడం విశేషం. వృద్ధ మహిళ ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని పక్కా ప్లాన్‌ ప్రకారం దాడి చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో కారం చల్లారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

ప్రకాశంజిల్లా మార్కాపురం పట్టణంలో మే 14వ తేదీ అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న వెంకటేశ్వరనగర్‌లో వృద్ధురాలిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. 82 ఏళ్ళ వృద్ధ మహిళ బండి రమణమ్మ స్థానిక వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె ఒంటరిగా ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న అదే వీధికి చెందిన ముగ్గురు యువకులు అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి జొరబడ్డారు. రమణమ్మ కళ్లలో తొలుత కారం చల్లారు. ఆమె బాధతో విలవిల్లాడుతుండగానే నోరు మూసి దారుణంగా కొట్టారు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. పైగా, ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని తీవ్రంగా బెదిరించారు. ఆ పరిణామంతో పూర్తిగా భయపడిపోయిన రమణమ్మ కొద్దిసేపటికి తేరుకుంది. వెంటనే పక్కింటి వారి సాయంతో తన కొడుకును పిలిపించుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ రమణమ్మను ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చించారు..ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలు రమణమ్మ ఫిర్యాదుపై మార్కాపురం డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు రంగంలోకి దిగారు. పట్టణ సీఐతో పాటు ముగ్గురు ఎస్సైలను ప్రత్యేక బృందంగా నియమించి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా అదే వీధిలో నివాసం ఉంటున్న ముగ్గురు యువకులను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారించడంతో ఈ దారుణాన్ని తామే చేసినట్టు నేరం అంగీకరించారు. నిందితులు కురుకుందుల మల్లికార్జున, కర్పూరపు వసుంధర, దండెబోయిన కాశీనాధ్‌లుగా గుర్తించారు.

ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చోరీలు చేయాలని నిర్ణయించుకున్నామని ముగ్గురు నిందితులు పోలీసులకు తెలిపారు. పోలీసుల విచారణలో డాగ్‌ స్క్వాడ్‌ నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో కారం చల్లినట్టు చెప్పుకొచ్చారు. చివరకు పోలీసుల దర్యాప్తులో చిక్కారు. నిందితుల నుంచి 6.40 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ళల్లో ఒంటరిగా ఉంటున్న మహిళలు, వృద్ధులు, ఇళ్ళకు తాళాలు పకడ్బందీగా వేసుకోవాలని, ఒకవేళ ఇంట్లో బంగారం, డబ్బు ఉంటే సమీపంలోని పోలీసులకు సమాచారం అందిస్తే రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేస్తామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు.

పథక రచన పూజారిదే..!

నిందితుల్లో ఒకరు పూజారిగా చలామణి అవుతున్న కాశీనాథ్ దొంగతనానికి కార్యాచరణ రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు మల్లికార్జున, అతని భార్య వసుంధర పూజారి కాశీనాథ్ దగ్గరకు పూజల కోసం తరచుగా వెళుతుంటారు. వీరికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని పూజారి కాశీనాథ్ వీరిని చోరీలకు ప్రేరేపించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అదే వీధిలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు రమణమ్మ ఒంటిపై ఉన్న బంగారాన్ని కాజేయాలని సలహా ఇచ్చింది పూజారి కాశీనాథేనని నిందితులైన భార్యాభర్తలు పోలీసులకు తెలిపారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts

Share this