SGSTV NEWS
Andhra PradeshCrime

మహిళా తహసీల్దార్‌కు రాత్రి 11 గంటలకు ఎమ్మెల్యే నుంచి ఫోన్‌..! అవును.. నేనే చేశానంటూ..

పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వర్సెస్ పార్వతీపురం తహసీల్దార్‌ జయలక్ష్మి వ్యవహారం సంచలనంగా మారింది. తనకు ఎమ్మెల్యే విజయచందర్ రాత్రి 10:59 నిమిషాలకు ఫోన్ చేసి అసహ్యంగా, అసభ్యకరంగా ఒక మహిళను అని కూడా చూడకుండా దూషించారని తహశీల్దార్ జయలక్ష్మి పేరుతో రాసి ఉన్న ఓ ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్ది గంటల్లోనే ఆ ఫిర్యాదు కాపీ రాష్ట్రమంతా చక్కర్లు కొట్టింది. ఫిర్యాదు కాపీ వైరల్ గా మారడంతో ఆ కాపీ పై ఎమ్మెల్యే విజయచంద్ర ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తహశీల్దార్ కు తాను ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, మధ్యాహ్నం నుండి అనేకసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదని, ఆర్డీఓకి కూడా ఫోన్ చేసి చెప్పానని అన్నాడు.

అలా చేస్తూ ఉంటే రాత్రి 11 గంటలకు కాల్ లిఫ్ట్ చేసిందని, తాను సమస్య పై మాత్రమే మాట్లాడానని అన్నారు. అంతటితో ఆగకుండా తహశీల్దార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తహశీల్దార్ జయలక్ష్మి లంచాలు తీసుకుంటుందని, ప్రతి పనికి ఒక రేట్ పెట్టుకుందని ఇవ్వకపోతే దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. అసలు తహశీల్దార్ కు మతిస్థిమితం లేదని, ఇలాంటి మతిస్థిమితం లేని వారు సర్వీస్ లో ఉండటానికి అర్హులు కారని వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని, ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెవిన్యూ మినిస్టర్ తో కూడా మాట్లాడాలని తెలిపారు.

అయితే ఎమ్మెల్యే విజయచంద్ర పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడు కలకలం రేపుతుంది. తహశీల్దార్ అవినీతి అధికారి అయితే ఎమ్మెల్యే చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉన్నారని, ఫిర్యాదు కాపీ వచ్చిన తర్వాత ఆరోపణలు చేయడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఫిర్యాదు కాపీ పై మాత్రం ఇప్పటివరకు తహశీల్దార్ నోరు మెదపలేదు. ఆ ఫిర్యాదు కాఫీ తనదే అని కానీ, తనకు సంబంధం లేదని కానీ చెప్పలేదు. అయితే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆరోపణలు అంగీకరించి ఎమ్మెల్యేకు బహిరంగ క్షమాపణ చెప్తారో? లేక మౌనం వహిస్తారో చూడాల్సి ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

Also read

Related posts

Share this