ఆధిపత్య పోరుతో ఆ గ్రామం అట్టుడుకి పోతుంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలన్న పట్టుదలతో ప్రత్యర్ధుల ప్రాణాలను కనికరం లేకుండా తీసేస్తున్నారు. నువ్వా నేనా అంటూ సాగుతున్న పోరులో గ్రామస్థులు నలిగిపోతున్నారు. గతంలో రెండు పార్టీల మధ్య ఫ్యాక్షన్ సాగగా.. ప్రస్తుతం ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య పెత్తనం కోసం సాగుతోంది. దీంతో పల్నాడులోని ఆ పల్లె భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తుంది.
ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే పల్నాడు జిల్లా వెల్దుర్ది మండలం గుండ్లపాడు గ్రామంలో ఆధిపత్యం కత్తులు దూసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం ముగియకముందే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తెలంగాణాలోని ఓ ఫంక్షన్కు బైక్ పై వెళ్లి వస్తున్న జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరావులను కారుతో గుద్ది ఆతర్వాత హత్య చేశారు. వీరిద్దరూ టిడిపికి చెందిన కార్యకర్తలు కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇద్దరి హత్యకు కారణం ఆధిపత్య పోరే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు వైసిపి, టిడిపి మధ్య ఫ్యాక్షన్ నడిచింది. ఆ సమయంలో వైసిపికి చెందిన చింతా శివరామయ్య వర్గం… టిడిపికి చెందిన తోట చంద్రయ్యను అత్యంత దారుణంగా హత్య చేసింది. గ్రామంలో అందరూ చూస్తుండగానే పీక కోసి ప్రత్యర్ధులు చంద్రయ్యను చంపేశారు. టిడిపి నియోజకవర్గ ఇంఛార్జ్గా బ్రహ్మారెడ్డిని నియమించడం ఆయన ర్యాలీకి గ్రామం నుండి యాభై బైక్లతో కార్యకర్తలను చంద్రయ్య తరలించడాన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్ధులు ఆయన్ను అత్యంత్య పాశవికంగా హత్య చేశారు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చంద్రబాబు స్వయంగా చంద్రయ్య అంత్య క్రియల్లో పాల్గొన్నారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు వారం రోజుల క్రితం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది.
ఇది ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిడిపిలోనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గానికి తోట వెంకట్రామయ్య ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో వర్గానికి జెవిశెట్టి వెంకటేశ్వర్లు నాయకుడిగా ఉన్నారు. అయితే కొద్ది కాలం క్రితం గతంలో వైసిపిలో ఉన్న ఉప్పుతోళ్ల శ్రీను.. తోట వెంకట్రామయ్య ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలో ప్లెక్స్ లు కట్టాడు. జెవిశెట్టి వెంకటేశ్వర్లు ఏరియాలో ప్లెక్స్లు కట్టడంతో ఆ వర్గం మండిపడింది. వైసిపి నుండి టిడిపిలో చేరిన శ్రీను తమ ఏరియాలో ప్లెక్స్లు కట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశ్వర్లు వర్గం ఏకంగా శ్రీనుపై దాడి చేసి కాలు విరగొట్టింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఫ్యాక్షన్ మర్డర్ జరగకుండా చర్యలు చేపట్టారు. ఏకంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో గొడవలు లేకుండా రెండు వర్గాలు, రెండు పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే తమ వర్గానికి చెందిన శ్రీనుపై… వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య వర్గం దాడి చేయాన్ని తోట వెంకట్రామయ్య వర్గం జీర్ణించుకోలేకపోయింది. తమ ఆధిపత్యాన్ని ముద్దయ్య సవాల్ చేయాడాన్ని తట్టులేకపోయింది. దీంతో పక్కాగా స్కెట్ వేసింది. ఈ రోజు వెంకటేశ్వర్లు, కోటేశ్వరావులు ఫంక్షన్కు వెళ్లి వస్తుండటాన్ని అవకాశంగా మలుచుకోని దాడి చేసి హత్య చేసింది. దీంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది. రెండేళ్ల క్రితం రెండు పార్టీల మధ్య జరిగిన హత్యతో బిక్కు బిక్కు మంటూ గడిపిన పల్లెవాసులు మరోసారి భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం స్థానికలు కళ్లలో కదలాడుతోంది. ఇప్పటికైనా ఈ హత్యలకు పుల్ స్టాఫ్ పడుతుందా లేదా అన్న ప్రశ్నే అందరి నోళ్లలో నానుతోంది
Also Read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!