February 23, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Liquor Scam: లిక్కర్‌ అక్రమాలపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. లెక్క తేలాల్సిందే..!



ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం అక్రమాలపై దర్యాప్తు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో సిట్‌ వేయడం ఆసక్తి రేపుతోంది.


ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయంలోని మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో సిట్‌ వేయడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో ఎవరెవరు ఉన్నారు?.. సిట్‌కు కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.


ఏపీ రాజకీయాల్లో హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి. మరోవైపు.. కూటమి ప్రభుత్వ వరుస నిర్ణయాలతోనూ మరింత ఏపీ వేడెక్కుతోంది. తాజాగా.. వైసీపీ హయాంలోని మద్యం అక్రమాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా విజయవాడ సీపీ రాజశేఖరబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సిట్‌ సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీలు కొల్లి శ్రీనివాస్, శ్రీహరిబాబు, డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు శివాజీ, నాగశ్రీనివాస్‌ను నియమించింది. దానిలో భాగంగా.. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని ఏడుగురు సభ్యుల సిట్‌ బృందానికి ఆదేశాలు ఇచ్చింది. సిట్ దర్యాప్తుకు అన్ని రకాల అధికారాలు కల్పించిన ఏపీ ప్రభుత్వం.. రికార్డులు సీజ్ చేసేందుకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇక.. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌లో జరిగిన అవకతవకలపై గతంలోనే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. అయితే.. ఈ దర్యాప్తును మరింత స్పీడ్‌ పెంచేందుకు సిట్‌ను నియమించాలని ఏపీ ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదనలు పంపారు. దాంతో.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనికి సంబంధించి సిట్ అధికారులు అడిగిన నివేదికను ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. ప్రతి 15 రోజులకోసారి దర్యాప్తు పురోగతిపై విచారణ నివేదిక ఇవ్వాలని కూడా సిట్‌ను ఆదేశించింది. సీఐడీ డీఐజీ ఆధ్వర్యంలోనే సిట్‌ పనిచేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ప్రభుత్వంలో ఏపీలోని మద్యం విక్రయాల్లో వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. నగదు లావాదేవీలతో పాటు హోలో గ్రామ్‌ల వ్యవహారంలోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. లిక్కర్‌ అక్రమాలపై సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి. సీఐడీ డీజీ ద్వారా రిపోర్ట్‌ సమర్పించాలని ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఆదేశించింది.

Also read

Related posts

Share via