SGSTV NEWS
Andhra PradeshCrime

ఏలూరు జిల్లాలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం



ఏలూరు జిల్లాలో పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారయత్న ఘటన చోటు చేసుకుంది. బాలికను నిందితుడి చెర నుంచి హిజ్రాలు కాపాడారు. ఈ ఘటన ఏలూరు టౌన్లో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఇంట్లో నుంచి వచ్చి ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో ఒంటరిగా బాలిక కూర్చోంది. శుక్రవారం అర్ధరాత్రి వేళ బాలిక వద్దకు ఆటో డ్రైవర్ ఆర్.ప్రభాకరరాజు (40) వెళ్లి మాయమాటలు చెప్పి ఆమెను ఇంటి వద్ద దించుతానని నమ్మించి ఆటో ఎక్కించుకున్నాడు. ఏలూరులోని పోణంగి రోడ్డులోని తన ఇంటికి తీసుకెళ్లి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు.

అయితే బాలిక భయంతో ఆటో డ్రైవర్ చెర నుంచి తప్పించుకుని ఇంటి నుండి బయటకు తీసుకొచ్చి కేకలు వేసింది. ఆ ప్రాంతంలోని హిజ్రాలు విషయాన్ని గమనించి బాలికను రక్షించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చిన తరువాత బాలికను వారికి అప్పగించారు. శనివారం బాలిక తల్లిదండ్రులు ఏలూరు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆటో డ్రైవర్ ఆర్.ప్రభాకరరాజుపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

Also read

Related posts

Share this