హైదరాబాద్: పని ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అన్నేసి గంటలు పని చేయడం తన వల్ల కాదంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్య చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని మియాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఏపీలోని పోలవరం (కోనసీమ) మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన ఉండ్రు సతీష్(31) నగరంలో ఐటీ ఉద్యోగి. కిందటి ఏడాది రవళి అనే యువతితో వివాహం అయ్యింది. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తూ.. మియాపూర్ బీకే ఎనక్లేవ్ కాలనీలో ఆ దంపతులు నివాసం ఉంటున్నారు.
సతీష్ భార్య సంక్రాంతి పండుగకు ఊరెళ్లగా.. తమ్ముడు సతీష్ వెంకటకృష్ణ అన్నకు తోడుగా ఉండిపోయాడు. ఈ క్రమంలో.. బుధవారం ఉదయం ఎంతకీ సతీష్ బెడ్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులు, స్థానికుల సాయంతో వెంకటకృష్ణ తలుపులు బద్ధలు కొట్టాడు. తీరా చూస్తే.. సతీష్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు.
హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి తట్టుకోలేకనే సతీష్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. అన్నేసి పని గంటలతో మానసికంగా అతను కుంగిపోయినట్లు నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన మియాపూర్ పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పని ఒత్తిడి గురించి మరోసారి చర్చకు దారి తీసింది.
Also read
- డాక్టర్ ప్రియాంక మరణంపై హత్య కేసుగా నమోదు చెయ్యాలి KVPS డిమాండ్
- యూనియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!
- రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత





