June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

చనిపోయిన వ్యక్తికి ఏడాది క్రితం బైక్ లోన్.. ‌రికవరీ కోసం ఇంటికి వెళ్తే బయటపడ్డ మోసం!

రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి పేరిట బ్యాంకు అధికారులు బుల్లెట్ బైక్ కు లోన్‌ ఇచ్చారు. కానీ, చివరికి ఏం జరిగిందంటే..?

ఇటీవల కాలంలో నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసే నేరగాళ్లు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు, ప్రభుత్వశాఖల పేర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి భూ కబ్జాలు, బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి చాలామంది లక్షల రూపాయాలను తీసుకొని మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం చనిపోయిన వ్యక్తి పేరు మీద ఈఎంఐ పేరుతో ఓ కేటుగాడు చేసిన పనికి లోన్‌ అధికారులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇంతకి ఏం జరిగిందంటే..?


రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి పేరిట బ్యాంకు అధికారులు బుల్లెట్ బైక్ కు లోన్‌ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని మరీ ఆయన పేరు మీద రూ.3 లక్షల విలువైన బుల్లెట్‌ బండి రిలీజ్ చేశారు. చివరకు కిస్తీలు సరిగా కట్టడం లేదంటూ వారి ఇంటికి వెళ్లి చూసిన బ్యాంక్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఆ వ్యక్తి చనిపోయి రెండున్నర సంవత్సాలు దాటిందని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ బ్యాంకు అధికారులు నివ్వెరపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా, ఈ విచిత్ర సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలో నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో చోటుచేసుకుంది. ఇక ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం.. నందిగామ గ్రామానికి చెందిన భూక్య సునీత, నగేశ్ దంపతులకు ముగ్గురు కొడుకులు. అందులో పెద్దవాడైన భూక్య రాకేష్ వివిధ సమస్యల కారణంగా 2022 జనవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

  అయితే ఈ ఘటన జరిగి దాదాపు రెండున్నర సంవత్సరాలకు పైగా అవుతుంది. కానీ, ఇప్పుడు కొంత మంది బ్యాంకు అధికారులు రాకేష్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే రాకేష్పేరు మీద లోన్ ఉందని, కిస్తీలు సరిగా కట్టడం లేదని దబాయించడంతో ఆయన తల్లిదండ్రులు, స్థానికులంతా షాక్ అయ్యారు. ఎందుకంటే.. రాకేష్‌ ఎప్పుడో చనిపోతే, ఆయన బండి తీసుకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు భూక్య రాకేష్ 2022 జనవరి 23న చనిపోగా, 2023 అక్టోబర్ 18న ఆయన పేరు మీద కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖమ్మం బ్రాంచ్ అధికారులు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్350 సీసీ ద్విచక్ర వాహనానికి సుమారు రూ.3 లక్షల లోన్ మంజూరు చేశారు. ఇలా మొత్తంగా 48 నెలల ఈఎంఐ ప్లాన్ కూడా ఇచ్చారు. ఈ మేరకు ప్రతి నెలా రూ.7,150 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని బండి రిలీజ్ చేశారు. ఆ తరువాత మూడు నెలల పాటు కిస్తీలు కూడా ఖాతాలో జమయ్యాయి. కానీ ఆ తర్వాత మాత్రం వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోవడంతో లోన్ రికవరీ కోసం కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్, వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు చేరుకున్నారు. అడ్రస్ వెతుక్కుంటూ రాకేష్ఇంటికి వెళ్లారు. అక్కడ బుల్లెట్ బండి కనపడకపోగా, ఆయన గతంలోనే చనిపోయాడన్న విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులు షాక్ గురయ్యారు.


ఇక తప్పుడు పత్రాలు సృష్టించి ఎవరో రాకేష్‌ పేరున తీసుకున్నరని కుటుంబ సభ్యులు చెప్పినా బ్యాంకు అధికారులు వినకుండా ఆ కుటుంబం పై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు ఎదురు తిరిగారు. ఎవరికి లోన్‌ ఇచ్చి ఇలా తమను కట్టమంటే ఎలా కడతామని నిలదీశారు. అనంతరం స్థానికంగా పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. అయితే మృతి చెందిన రాకేష్ మిత్రుడొకరు నర్సంపేటకు చెందిన వ్యక్తికాగా, ఆయన ద్వారానే ఈ బాగోతం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా నర్సంపేటకు చెందిన వ్యక్తే బండి తీసుకుని, బ్యాంక్ సిబ్బంది, దళారుల సహాయంతో ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. పైగా రాకేష్ పేరున తప్పుడు పత్రాలు సృష్టించి, బ్యాంకు సిబ్బందిని మేనేజ్ చేసి లోన్ మీద బండి తీసుకుని మోసానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయంపై సంబంధిత బ్యాంకు అధికారులు కూడా పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం అందింది. మరి, చనిపోయినా వ్యక్తి పేరున లోన్‌ తీసుకొని బుల్లెట్‌ బైక్‌ కొనుగోలు చేసి బురిడి కొట్టించిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Also read

Related posts

Share via