SGSTV NEWS online
Spiritual

ఆత్మ నరకలోక ప్రయాణం – సౌరిపురం దారిలో స్వాగతం పలికే విషసర్పాలు, కౄరమృగాలు, భయానక దృశ్యాలు

Gమొదటి మాసిక పిండాన్ని స్వీకరించిన తర్వాత, ఆత్మ తన తదుపరి గమ్యస్థానమైన సౌరిపురం వైపు ప్రయాణాన్ని ప్రారంభిస్తుందట. మరణించిన రెండవ నెలలో ఆత్మ ఈ పట్టణానికి చేరుకుంటుందని గరుడపురాణం చెబుతోందట. సౌరిపుర ప్రయాణంలో ఆత్మ ఎదుర్కొనే భయానక పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌరిపుర ప్రయాణ మార్గం – భీతిని గొలిపే దృశ్యాలు:

సౌమ్యపురం నుంచి సౌరిపురానికి వెళ్లే మార్గం అత్యంత భయంకరంగా ఉంటుందట. ఆత్మ వెళ్లే దారిలో క్రూర మృగాలు, విష సర్పాలు, చీకటి నిండిన అడవులు స్వాగతం పలుకుతాయట. ఆత్మ భయంతో వణికిపోతున్న జాలి అనేదే చూపకుండా ఆత్మ చేసిన పాపాలను గుర్తు చేస్తూ.. యమకింకరులు ఆత్మను పాశాలతో కట్టి, కొడుతూ ముందుకు నడిపిస్తారట.

శారీరక మరియు మానసిక స్థితి: సౌరిపుర ప్రయాణంలో ఆత్మకు విశ్రాంతి అనేదే ఉండదట. నిరంతరం నడవడం వల్ల ఆత్మ విపరీతమైన అలసటను అనుభవిస్తుందట. పైగా యమదూతల భయంకర రూపాలు, వారు చేసే గద్దింపులు చూసి ఆత్మ వణికిపోతుందట. తను చేసిన పాపాలను తలచుకుంటూ రోదిస్తుందట. అయితే ఈ ప్రయాణంలో ఆత్మకు తన భౌతిక శరీరం లేనప్పటికీ, కర్మ శరీరం (యాతనా శరీరం) ద్వారా నొప్పిని, వేదనను అనుభవిస్తుందట.

సౌరిపురంలో ఎదురయ్యే పరిణామాలు : సౌరిపురం

చేరుకోగానే అక్కడ జంగమ అనే పేరు గల యమధర్మరాజు ప్రతినిధిని ఆత్మ కలుస్తుంది. జంగమ వికృత రూపంతో ఆత్మను మరింత భయపెడతాడట.

సౌరిపురంలో ఆత్మకు ఎదురయ్యే ప్రధాన ఇబ్బందులు:

ఈ పట్టణంలో ఆత్మకు భూలోకంలో బంధువులు పెట్టే రెండవ మాసిక పిండం అందుతుందట. ఒకవేళ బంధువులు ఈ కర్మను సరిగ్గా చేయకపోతే, ఆత్మ తీవ్రమైన ఆకలితో అల్లాడిపోతుందట. ఈ పట్టణంలో ఉన్నప్పుడు ఆత్మకు తన భార్య, పిల్లలు, సంపాదించిన ఆస్తి మీద వ్యామోహం ఇంకా తగ్గదట. తన వారు తనను రక్షించలేకపోతున్నారని, తన కోసం కర్మలు చేస్తున్నారో లేదో అని నిరంతరం ఆందోళన చెందుతుందట.

త్రైపాక్షిక సమయం: మనిషి మరణించిన 45 రోజుల తర్వాత అతని ఆత్మ ఈ ప్రాంతాన్ని దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుందట. ఈ సమయంలోనే ‘త్రైపాక్షికం’ అనే కర్మను భూలోకంలో నిర్వహిస్తారట. ఈ పిండం ఆత్మకు సౌరిపురం నుండి తదుపరి పట్టణమైన నగేంద్ర భవనానికి వెళ్లడానికి అవసరమైన శక్తిని ఇస్తుందట.

సౌరిపుర ప్రయాణం ఆత్మకు తన ఒంటరితనాన్ని, తాను చేసిన కర్మల తీవ్రతను పరిచయం చేసే ఘట్టంమట. “నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్తున్నాను, నా వెంట నా కర్మలు మాత్రమే వస్తున్నాయి” అనే పచ్చి నిజాన్ని ఆత్మ ఈ దశలో గ్రహిస్తుందట. గరుడపురాణం ప్రకారం, ఈ పట్టణాల గుండా ప్రయాణించేటప్పుడు ఆత్మ పడే కష్టాలు వర్ణనాతీతం. అందుకే ఆత్మకు ఆ కష్టాల నుండి ఉపశమనం కలిగించడానికి భూలోకంలో పుత్రులు ప్రతి నెలా శ్రద్ధగా మాసికాలను నిర్వహించాలని పెద్దలు చెబుతుంటారు.

Related posts