SGSTV NEWS online
CrimeTelangana

నెలక్రితం ఆమె తలలో దిగింది బుల్లెట్టే..!



తేల్చిన ఫోరెన్సిక్ విభాగం

కాల్చింది ఉత్తరప్రదేశ్ యువకుడు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు?

కరీంనగర్: మెట్పల్లి పట్టణానికి చెందిన గోనెల లక్ష్మీపై నెల క్రితం జరిగిన దాడి సంఘటనకు సంబంధించి ఆమె తలలో నుంచి బయటపడింది బుల్లెట్టేనని ఫోరెన్సిక్ విభాగం పరిశీలనలో తేలినట్లు తెలిసింది. ఆ రోజు సదరు మహిళను ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు కాల్చినట్లు గుర్తించిన పోలీసులు.. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని మూడురోజుల క్రితం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీలక నిందితుడైన యూపీ యువకుడు పట్టుబడడంతో కేసుపై ఉన్న అనుమానాలు తొలగిపోనున్నాయి.

ఉపాధి కోసం వచ్చి..

వెంట రివాల్వర్ తెచ్చుకుని..

పట్టణంలోని మఠంవాడకు చెందిన గోనెల శంకర్కు జేసీబీ ఉంది. దానికి డ్రైవర్గా కొంతకాలం నుంచి ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు పనిచేస్తున్నాడు. అతడు ఇక్కడకు వచ్చేటప్పుడే తన వెంట రివాల్వర్ తెచ్చుకున్నట్లు తెలిసింది. శంకర్కు తన సోదరుడైన రాజం కుటుంబంతో ఆస్తి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 15న అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న రాజం భార్య లక్ష్మీపై శంకర్, అతని భార్య అనూష, బావమరిది ముత్తన్న యూపీ యువకుడితో కలిసి దాడి చేశారు.

ఈ సంఘటనలో లక్ష్మీ తలకు తీవ్ర గాయం కాగా.. మొదట స్థానిక ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ తీయగా ఆమె తలలో ఇనుప ముక్క లాంటిది ఉందని తేలడంతో వైద్యులు శస్త్ర చిక్సిత చేసి తొలగించారు. ముందుగా తనపై కర్రతో దాడి చేశారని లక్ష్మీ చెప్పడంతో తొలుత మామూలు దాడి అని భావించిన పోలీసులు.. బయటపడింది ఇనుపముక్క బుల్లెట్లాగా ఉండడంతో కంగుతిన్నారు. తర్వాత దానిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. అది బుల్లెట్టేనని తేలడంతో దర్యాప్తు జరిపి ఆమెపై కాల్పులకు పాల్పడింది యూపీ యువకుడు అని నిర్ధారణకు వచ్చారు.

దాడి తర్వాత యూపీకి పరార్..

లక్ష్మీపై దాడి అనంతరం అదే రోజు సదరు యువకుడు యూపీకి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్ నివేదిక రావడంలో జాప్యం నెలకొనడంతో ఇనుప ముక్క విషయంలో స్పష్టత లేక ఇంతకాలం వేచి చూసిన పోలీసులు.. అది బుల్లెట్ అని ఫోరెన్సిక్ విభాగం తేల్చడంతో మూడు రోజుల క్రితం యూపీకి వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని మెట్పల్లికి తీసుకొచ్చినట్లు తెలిసింది. నెలకుపైగా మిస్టరీగా ఉన్న ఈ కేసు యువకుడు పట్టుబడడంతో మరో రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశముంది.

Also read

Related posts