కామవరపుకోట (ఏలూరు జిల్లా) : మూత్ర విసర్జన చేశారనే నెపంతో దళిత యువకుడిపై అగ్రకులానికి ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటుపల్లి పంచాయతీ పరిధిలోని కంఠమనేనివారిగూడేనికి చెందని దళిత యువకుడు గెడ్డం రవితేజ శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లారు. హెచ్పిసిఎల్ భవనం సమీపంలో రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా అక్కడ మద్యం సేవిస్తున్న అదే గ్రామానికి చెందిన గద్దె సుభాష్, జలపర్తి రాహుల్, కొమ్మిన రత్నాజీ ఇక్కడ ఎందుకు మూత్ర విసర్జన చేస్తున్నావంటూ కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన రవితేజను చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. బాధితుడు గెడ్డం రవితేజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దళిత యువకుడిపై దాడి చేసిన వారిపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కెవిపిఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు. గాయపడిన రవితేజకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. దళిత యువకుడిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎస్సి, ఎస్టి, బిసి మైనారిటీ హక్కుల సాధన సమితి నాయకులు టివిఎస్.రాజు డిమాండ్ చేశారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





