దొంగతనాలకు కాదేది అనర్హం అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు దొంగతనాలనే తమ వృత్తిగా ఎంచుకుంటున్నారు. పగలు రెక్కీలు నిర్వహిస్తూ, రాత్రి సమయాలల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని వైన్ షాప్నే టార్గెట్ చేశారు దొంగలు. గత నెల రోజులుగా వైన్ షాపుల్లో చోరీ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల సారపాక లోని రెండు వైన్ షాపుల్లో చోరీకి పాల్పడిన దొంగలు విలువైన మద్యాన్ని కారులో ఎత్తుకుపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఎట్టకేలకు పోలీసులు అశ్వరావుపేట వద్ద ఆ మద్యం బాటిల్ గుర్తించి దొంగల్ని అరెస్టు చేశారు. . అయితే తాజాగా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో తెల్లవారుజామున జరిగిన ఓ దొంగతనం స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది. ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడితే దొరికిపోతామని ఉద్దేశంతో కొందరు దొంగలు, ఊరి శివారుల్లో ఉన్న మద్యం షాపుల్లో చోరీకి పాల్పడుతున్నారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డ్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ముందు జాగ్రత్తతో కెమెరాలను పక్కకు తిప్పి తలుపులు పగలగొట్టడం చూస్తే దొంగలు టెక్నికల్ గా ఎంత ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఎలాగోలా షాపు లోపలికి వెళ్ళిన దొంగలకు మాత్రం ఈసారి నిరాశ ఎదురయింది. షాపులో నగదు లేకపోవడంతో ఏకంగా అక్కడే సిట్టింగ్ వేశారు. తనివి తీరా కడుపు నిండే వరకు మద్యం సేవించి ఆ తర్వాత అందిన కాడికి మద్యం సీసాలను ఎత్తుకు వెళ్లారు. మద్యం షాపుల్లో దొంగతనం జరిగిందనే విషయం గుప్పుమనడంతో అక్కడికి వెళ్లిన జనాలు చోరీ విషయం పక్కకు పెట్టి దొంగలు వేసిన సిట్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. సిట్టింగ్ వేసిన బల్ల మీద ఉన్న బాటిల్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఇంత తాగి మళ్లీ మద్యం సీసాలు ఎత్తకపోవడం ఏంట్రా బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబందించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మద్యం దొంగల కోసం గాలింపు చేపట్టారు
Also read
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..
- ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్కు తీసుకెళ్లి..





