ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన వృద్దురాలిని ఓ దివ్యాంగుడు కాపాడాడు. ఆయన ఆరోగ్యం సరిగా లేకున్నా బావిలోకి దిగి విలవిలలాడుతున్న ఓ ప్రాణాన్ని కాపాడాడు. దీంతో చివరి నిమిషంలో వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. తుది శ్వాస వదిలేస్తుందనుకున్న క్రమంలోనే దివ్యాంగుడు అప్రమత్తమవ్వడంతో ఓ ప్రాణం దక్కినట్లయింది. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన గడ్డం మల్లమ్మ(80) శనివారం వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడింది. సమీపంలోనే ఓ ఇంట్లో ఉంటున్న బండారి రవిందర్ అనే దివ్యాంగుని భార్య వృద్దురాలిని గమనించింది. అప్పుడే అక్కడ కూర్చొని ఉన్న వృద్దురాలు కనిపించడం లేదని బావిలో జారిపడిపోయి ఉంటుందని తన భర్తకు సమాచారం ఇచ్చింది.
దీంతో వెంటనే బావి వద్దకు చేరుకున్న రవిందర్.. వృద్దురాలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని గమనించాడు. బావిలోకి దిగిన రవిందర్ వృద్దురాలిని కాపాడాడు.. తన కాళ్లపై ఆమె తల పెట్టి కరెంటు మోటర్ బెల్టు సాయంతో నీటిలోని ఉండిపోయాడు. 20 నిమిషాల పాటు ఆమెను అలాగే పట్టుకుని ఉన్నాడు.
ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని వృద్దురాలిని తాళ్ల సాయంతో బయటకు తీశారు. చికిత్స కోసం వెంటనే ఆమెను హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. మల్లమ్మను కాపాడేందుకు సాహసించిన రవిందర్ ను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. అయితే వృద్ధురాలి మానసిక పరిస్థితి బాగా లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.. ప్రస్తుతం..వృద్దురాలు కోలుకుంటుందని వెల్లడించారు.
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





