SGSTV NEWS online
Andhra PradeshCrime

పోలీస్‌ స్టేషన్‌లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం!






అల్లూరి సీతారామరాజు జిల్లా: డుంబ్రిగూడ పోలీస్‌ స్టేషన్‌లో భారీ శబ్దంతో తుపాకీ పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ ఎస్‌ఐ సత్యనారాయణ.. AK-47తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన ఛాతికి బుల్లెట్ గాయాలు కావడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.


ఆత్మహత్యకు ముందు ఆర్‌ఐకి ఫోన్

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో సత్యనారాయణ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు ఆర్‌ఐకి ఫోన్ చేసిన ఆయన.. కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోతానని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆర్‌ఐ ఆయనకు ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.


రక్తపు మడుగులో సత్యనారాయణ

ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది వినాయక చవితి పూజా కార్యక్రమాల్లో ఉన్నారు. సోమవారం (సెప్టెంబర్ 14) ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో ఒక్కసారిగా AK-47 కాల్పుల శబ్దం వినిపించడంతో సిబ్బంది అప్రమత్తమై అక్కడికి పరుగులు తీశారు. సత్యనారాయణ ఛాతి కుడివైపు కాల్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయన తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయాడు. మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సత్యనారాయణను వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఎస్‌ఆర్‌ పురం గ్రామంగా సమాచారం. ఆయన ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌కు చెందిన సిబ్బందిగా డుంబ్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

దర్యాప్తు ప్రారంభం

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు ఎలా జరిగాయి? సర్వీస్‌ రైఫిల్ ఆయన వద్దకు ఎలా వచ్చింది? ఘటనకు ముందు, తర్వాత స్టేషన్‌లో ఏం జరిగింది? అనే అంశాలపై విచారణ చేస్తున్నారు. కుటుంబ సమస్యలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమికంగా ఆత్మహత్యాయత్నంగా అనుమానిస్తున్నప్పటికీ.. పూర్తి దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించిన స్పష్టమైన వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Also read

Related posts