SGSTV NEWS online
Andhra PradeshCrime

కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..





అనకాపల్లి పట్టణంలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాలికకు పరిచయమైన వ్యక్తి అత్యాచారానికి పాల్పడగా, తల్లి అతడిని అడ్డుకోకుండా సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఇన్‌ఛార్జి డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి పట్టణానికి చెందిన ఓ వివాహిత తన భర్తతో విభేదాల కారణంగా ఇంటర్మీడియట్‌ చదువుతున్న కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తోంది. ఈ క్రమంలో స్థానిక చేపల మార్కెట్‌ సమీపంలోని సచివాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.


ఆ పరిచయం అనంతరం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ వ్యక్తి బాలికపై కన్నేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. విషయం తెలిసినప్పటికీ బాలిక తల్లి అతడిని వారించకుండా ప్రోత్సహించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 7న నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక అదే రోజు బాత్‌రూమ్‌ శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితిని గమనించిన తల్లి బాలికను చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది.

అనంతరం పోలీసుల విచారణలో బాలిక తనకు జరిగిన ఘటన గురించి వివరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. బాలిక వాంగ్మూలం, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా కేసులో మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also read

Related posts