SGSTV NEWS online
Andhra PradeshCrime

అన్నా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది..!



కాళ్ల పారాణి ఆరకముందే ఆ నవ వధువు నిండు జీవితం ముగిసిపోయింది.. కొత్త బంధంతో సరికొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన నాలుగు నెలలకే ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉత్తీర్ణురాలైన ఆమె తన గుండెబాధను అధిగమించలేకపోయింది. విజయవాడ అజిత్సంగ్నగర్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలోని అయోధ్యనగర్ బసవతారక నగర్లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

అయోధ్యనగర్ బసవ తారక నగర్ ప్రాంతానికి చెందిన గోనోల్ల దేవేంద్రకు అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందిన మారాని చంద్రకళ (24) తో ఈ ఏడాది ఏప్రిల్ 23న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఎంబీఏ చదువుకున్న చంద్రకళ ఇంటివద్దే ఉంటుండగా దేవేంద్ర హనుమాన్పేటలోని ప్రైయివేటు ట్రావెల్స్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రోజూలానే శుక్రవారం ఉదయం దేవేంద్ర పనికి వెళ్లగా చంద్రకళ ఇంటిలోనే ఉంది.

మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేవేంద్ర భోజనానికి ఇంటికి బయల్దేరుతుండగా చంద్రకళ స్నేహితుడు రమణ ఫోను చేసి అన్నా నాకు చాలా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది.. నువ్వు త్వరగా ఇంటికి వెళ్లమని చెప్పాడు. దీంతో హుటాహూటిన పని నుంచి ఇంటికి వెళ్లగా భార్య తలుపు వేసుకొని, గొళ్లెం పెట్టుకొని ఉంది. కిటికీ తెరచి చూడగా చంద్రకళ తన చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కలినిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో గొళ్లెం పగలగొట్టి లోపలకు వెళ్లి చంద్రకళను కిందకి దించాడు. అంబులెన్స్ డాక్టర్ పరీక్షించి అప్పటికే చనిపోనట్టు నిర్ధారించారు.

ఇష్టం లేని వివాహం చేసినందుకేనా..?

చంద్రకళకు ఇష్టం లేని వివాహం చేయడం వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీఏ చదువుకున్న ఆమెకు బెంగళూరులో ఉంటున్న తన స్నేహితుడంటే ఇష్టమై ఉండొచ్చని.. ఆమె కాల్ లిస్ట్లో చివరిగా మాట్లాడిన కాల్ కూడా అతనిదేనని సమాచారం. మృతికి కారణాలు పూర్తిగా తెలియడం లేదని.. యువతి తల్లిదండ్రులు నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.

Also read

Related posts