SGSTV NEWS online
Andhra PradeshCrime

పిల్లల ప్రాణాలు పోలేదుగా.. చిన్న గీతే కదా! వార్డెన్ సమాధానం


బ్లేడు సరిగా తెగకపోవడంతో స్వల్ప గాయాలు

తల్లిదండ్రులకు  సమాచారం  ఇవ్వకుండా  దాచిపెట్టిన వార్డెన్

విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణం

ఆంధ్రప్రదేశ్, విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు  మోడల్ స్కూల్ హాస్టల్ లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్ బాష కుమార్తె సోఫియా స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.

ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్ కనీసం తల్లిదండ్రులకు కూడా తెలపలేదు.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్కు చేరుకుని ప్రిన్సిపాల్, వార్డెన్లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్ నల్లమ్మను నిలదీశారు. ఇందుకు వార్డెన్.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా ఏదో చిన్న గీత పడిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also read

Related posts