SGSTV NEWS online
CrimeTrendingViral

Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి!



ఓ నగల దుకాణంలో జరిగిన వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుకాణం నుంచి 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు కనిపించకుండా పోవడంతో యజమాని దొంగతనం జరిగిందని భావించాడు. దొంగను పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అసలు నిజం బయటపడింది..

ఓ గోల్డ్‌ షాపులో తరచూ బంగారు ఆభరణాలు మాయం అవుతున్నాయి. అలా సుమారు 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు కనిపించకుండా పోవడంతో యజమానికి పిచ్చెక్కిపోయింది. ఎంత వెతికినా దొంగిలించింది ఎవరో కనిపెట్టలేకపోయారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే నగలు దొంగతనం చేస్తున్న ఆ రహస్య దొంగ ఎవరో కనిపెట్టేందుకు షాపు యజమాని వెంటనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాడు. వీడియోలో కనిపించిన కిలాడి దొంగను చూసి అవాక్కయాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ గోల్డ్‌ నగల దుకాణంలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే..



కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో విశ్వాస్ జ్యువెలర్స్‌ అనే ఓ గోల్డ్‌ షాపులో నిత్యం బంగారు ఆభరణాలు కనబడకుండా పోతున్నాయి. ప్రతి ఉదయం దుకాణానికి వచ్చిన సిబ్బంది కొన్ని బంగారు ఉంగరాలు కనిపించకపోవడాన్ని గమనిస్తున్నారు. దీంతో వారు వెంటనే యజమానికి సమాచారం అందించారు. దొంగను కనిపెట్టేందుకు యజమాని దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే సీసీటీవీలో కనిపించిన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా ఇప్పటి వరకు మొత్తం 10 ఉంగరాలతో పాటు వాటికి సంబంధించిన ధర ట్యాగ్‌లు కూడా ఎత్తుకుపోయింది. సాధారణంగా దొంగలు బంగారాన్ని మాత్రమే తీసుకెళ్తారు కానీ ట్యాగ్‌లను తీసుకెళ్లరని భావించిన యజమానికి ఏదో అసాధారణ ఘటన జరిగిందనే అనుమానం వచ్చింది.

సీసీటీవీ ఫుటేజీలో అయితే నగలు దొంగిలించినది మనిషి కాదు.. ఓ ఎలుక అని తేలడంతో అంతా తెల్లమొహాలు వేశారు. రాత్రి సమయంలో ఓ ఎలుక దర్జాగా షాపులో ప్రవేశించి.. బంగారు ఉంగరాన్ని నోటితో పట్టుకుని పరుగెత్తడం వీడియోలో కనిపించింది. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రికార్డైన వీడియోలో అసలు విషయం బయటపడింది. ఎలుక బంగారు ఉంగరాలను తీసుకెళ్లినట్లు గుర్తించిన సిబ్బంది షాపు మొత్తం వెతికారు. షాపులో ఎలుకలు చేసిన కలుగులు, వాటి దారులు కనిపించాయి. చివరకు ఆ కలుగుల్లోనే కనిపించకుండా పోయిన 10 బంగారు ఉంగరాలు, ధర ట్యాగ్‌లు దొరికాయి. అయితే వీటిని దొంగిలించిన దొంగ ఎలుక మాత్రం వారికి కనిపించలేదు. షాపు సిబ్బంది కలుగులన్నింటినీ మూసి వేశారు.

విశ్వాస్ జ్యువెలర్స్‌లోని మా సిబ్బంది అంతా చాలా సంతోషంగా ఉన్నారు. కనిపించకుండా పోయిన నగలన్నింటినీ సురక్షితంగా తిరిగి పొందామని షాపు యజమాని తెలిపారు. అయితే ఈ బంగారు నగలు చోరీ చేసిన ‘దొంగ’ అయిన ఎలుకపై పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా? అన్నది ఇంకా తెలియలేదు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది.

Also read

Related posts