చిన్నపిల్లలకు చిన్న చీమ కరిచినా అయ్యో అంటాం… అలాంటిది ఏకంగా అట్ల కాడతోనే వాతలు పెట్టిన అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండలో ఈ ఘటన జరిగింది. చోరీ నెపంతో ఓ బాలికపై దాడి చేయడమే కాకుండా.. ఆమె శరీరాన్ని వాతలు పెట్టి కాల్చారు. బాధిత కుటుంబం, పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం..
చర్చి పాస్టర్ ఇంట్లో దారుణం…
జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని ఏనుగుబయలు గ్రామానికి చెందిన ఒక గిరిజన దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక గత పది నెలలుగా ధారకొండలోని చర్చి పాస్టర్ జయరాజ్ ఇంట్లో పని చేస్తూ, అక్కడే ఉంటోంది. అయితే, ఇటీవల పాస్టర్ ఇంట్లో కొంత నగదు మాయమైంది. దీనితో ఇంట్లోనే ఉంటున్న ఆ చిన్నారిపై పాస్టర్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆ బాలికను ప్రశ్నించారు. తనకు తెలియదని చెప్పినా దాడి చేశారు.
నిజం చెప్పాలంటూ చిత్రహింసలు..
డబ్బుల విషయమై ఆ ఎనిమిదేళ్ల బాలికను పాస్టర్ తీవ్రంగా ప్రశ్నించాడు. తనకు ఆ డబ్బు గురించి ఏమీ తెలియదని, తాను తీయలేదని ఆ చిన్నారి ఎంత మొరపెట్టుకున్నా వారి మనసు కరగలేదు. బాలికపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా, వంటింట్లో వాడే అట్లకాడను స్టవ్ మీద బాగా కాల్చి, ఆ చిన్నారి చేతులపై వాతలు పెట్టారు. ఆ వేడిని భరించలేక ఆ పాప పెట్టిన కేకలు కంటికి కనిపిస్తున్న దేవుడి లాంటి పాస్టర్ హృదయాన్ని కరిగించలేకపోయాయి.
పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు..
ఈ దారుణ హింస తర్వాత బాలిక ఎలాగోలా తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని, జరిగిన ఘోరాన్ని ఏడుస్తూ వివరించింది. కూతురి శరీరంపై ఉన్న కాలిన గాయాలు, వాతలను చూసి ఆ గిరిజన తల్లిదండ్రులు గుండెలు బాధుకున్నారు. నమ్మి పంపితే తమ బిడ్డను ఇంతలా చిత్రహింసలు పెడతారా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ అమానుష ఘటనపై తమకు న్యాయం చేయాలంటూ బాధిత తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిన్నారిపై జరిగిన దాడి తీవ్రతను గమనించిన పోలీసులు నిందితుడైన పాస్టర్పై కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు. అమాయక బాలికపై జరిగిన ఈ క్రూరత్వాన్ని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Also read
- ఘోరం.. కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపి.. కొడుకు ఆత్మహత్య! కారణం అదేనా?
- Telangana: ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి వచ్చి చూడగా..
- Hyderabad: కామంతో రెచ్చిపోయాడు.. కట్చేస్తే.. ఊహించని ట్విస్ట్..
- అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి





