SGSTV NEWS online
Famous Hindu Temples

Dharmasthala Temple ధర్మస్థల మంజునాథ ఆలయం విశిష్టత.. భక్తులు ఎక్కువగా వెళ్లడానికి కారణాలివే!



Sri Dharmasthala Manjunatha Swamy Temple : ధర్మస్థల ముంజునాథ ఆలయం హిందూ పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా, బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఈ శైవక్షేత్రం ఉంది. ఇప్పుడు ఈ శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథ టెంపుల్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


Dharmasthala Manjunatha Swamy Temple History in Telugu : కర్ణాటక రాష్ట్రంలోని నేత్రావతి నదీ తీరం ధర్మస్థలలో కొలువై ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయం 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు మంజునాథుడి రూపంలో దర్శనమిస్తారు. వైష్ణవులు అర్చకులుగా వ్యవహరిండం శైవక్షేత్రం ప్రత్యేకత. ఈ శైవక్షేత్రంలో శివలింగం, నంది విగ్రహాలే కాకుండా నలుగురు ధర్మ దేవతలు, అలాగే జైనులు భక్తి శ్రద్ధలతో ఆరాధించే బాహుబలి విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కార్తికమాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవం చూడటానికి రెండు కళ్లు చాలవు.

ధర్మస్థల క్షేత్ర స్థల పురాణం

దక్షిణ కర్ణాటకలోని మల్లార్మడి అనే గ్రామంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మన పురాణాల ప్రకారం కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ జైన అధిపతి అయిన బీర్మన్న పెర్గడే, అతని భార్య అమ్ము బల్లాల్తీ కుటుంబం నివసించేవారు. వీళ్లు చాలా ధర్మబద్ధంగా నడుచుకుంటూ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు. ఓరోజు వీళ్ల ఇంటికి ధర్మ దేవతలుగా పిలిచే కాళ రాహు, కలర్కాయ్‌, కుమారస్వామి, కన్యాకుమారి వీళ్లు మారువేషంలో రావడంతో ఈ దంపతులు ఎప్పటిలానే వాళ్లని ఆదరించారు.




కలే కథకు మలుపు

అయితే ఆరోజు రాత్రి బీర్మన్నకు ఇంటికి వచ్చిన ధర్మదేవతలు కలలో కనిపించి తమ గురించి తెలియజేశారు. అంతేకాకుండా బీర్మన్న కుటుంబం ఉంటున్న ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలి అనుకున్నట్లుగా చెప్పడంతో ఆ మరుసటి రోజే బీర్మన్న కుటుంబం ఆ ఇల్లు వదిలి వెళ్లిపోయారట. అలాగే మరికొన్ని రోజులకు ఆ దేవతలే బీర్మన్నకు కలలో కనిపించి తమ విగ్రహాలు ప్రతిష్టించనమని చెప్పారట.



వాళ్లు చెప్పిన ప్రకారం బీర్మన్న ఆ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారట. ఆ సమయంలో అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించేందుకు విచ్చేసిన బ్రాహ్మణులు ఇక్కడ శివలింగం కూడా ఉంటే శుభప్రదంగా ఉంటుందని చెప్పడంతో అన్నప్ప అనే మరో భక్తుడు వెంటనే శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడట. ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని రోజులకు భీర్మన్న వంశస్థుడైన దేవరాజ హెగ్గడే అనే మరో భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతిని ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించాడట. ఆ వరదరాజస్వామి స్వామీజీ ఈ ఆలయానికి విచ్చేసి ఇక్కడి శివలింగానికి విశేషమైన పూజలు నిర్వహించి అక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమాలను పరిశీలించి.. ఈ క్షేత్రానికి ధర్మస్థల అని పేరు పెట్టారని.. అప్పటి నుంచి ఈ క్షేత్రం ధర్మస్థలగా పేరుగాంచిందని ప్రశస్తి.




ఆలయ దర్శన సమయాలు

ధర్మస్థలిలోని శ్రీమంజునాథ స్వామి వారి దేవాలయం వేకువజామున 4 గంటలకు తెరుచుకుంటుంది. శుద్ధి కార్యక్రమాల తర్వాత ఉదయం 6.30 గంటల నుంచి 11 గంటల వరకూ భక్తులను దర్శనానికి అనుమతి ఉంటుంది. అనంతరం ఉదయం 11.30 గంటలకు మంజునాథుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అన్నదానం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గుడిలో మాహాపూజ జరుగుతుంది. ఈ సమయంలో పూజారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ సమయంలో దర్శనాలు నిలిపివేస్తారు. అనంతరం ఈ ప్రదక్షిణలు పూర్తయ్యాక 12.15 నుంచి మధ్యాహ్నం 2.30 నిమిషాల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.00 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు స్వామి వారి దర్శనం కొనసాగుతుంది. ఆ తర్వాత 8.30 గంటలకు మహాపూజ నిర్వహిస్తారు.



ఎలా చేరుకోవాలంటే?

ఈ మంజునాథ ఆలయం బెంగళూరు నుంచి 300 కిలోమీటర్లు, మంగళూరు నుంచి అయితే 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో వెళ్లాలనుకునే భక్తులు మంగళూరు రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల సాయంతో మంజునాథ ఆలయానికి చేరుకోవచ్చు. విమానంలో రావాలనుకునే భక్తులు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగితే సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఇక్కడ వసతి గదులను కేవలం ఆన్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Related posts