SGSTV NEWS online
Andhra PradeshCrime

Bus Fire: గాడ నిద్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. క్షణాల్లో మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు!




అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే అప్పటికే మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సులోని ప్రయాణికులను అంతా కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ట్రావెల్స్ బస్సులు 35 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి చెన్నైకు బయల్దేరింది. అయితే మార్గమధ్యలో ఒక దగ్గర భోజనాలు ఆపి భోజనాలు పూర్తయ్యాక బస్సు మళ్లీ విశాఖ వైపు స్టార్ట్ అయింది. అయితే సరిగ్గా అనకాపల్లి జిల్లాలోకి రాగానే బస్సు ముందు భాగంలోని ఎడమ వైపు నుంచి ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమైంది. దాంతో బస్సులో ఉన్న సేఫ్టీ అలారం మోగింది.


అలారం వినబడగానే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కన ఆపి, అందులో ఉన్న ప్రయాణికులను అందరిని కిందకు దించేశాడు. ప్రయాణికులంతా కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. ఇక డ్రైవర్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది..


ఈ ప్రమాదంపై అనకాపల్లి రూరల్ సీఐ నుంజయ్ మాట్లాడుతూ.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు.బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే ఇంత పెద్ద ముప్పు తప్పింది, లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. బస్సు ఇంజన్ భాగంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని పరిశీలించామని, ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులైన ప్రయాణికులకు చెన్నై వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.

Also read

Related posts