SGSTV NEWS online
CrimeTelangana

25 లక్షలిస్తే.. మా అబ్బాయి మీ అమ్మాయి జోలికి రాడు..



బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు కొత్త మలుపు తిరిగింది . తనను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడని బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడి తల్లితో పాటు మేనమామపై కేసు నమోదు చేశారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది.

వివరాల్లోకి వెళితే.. జూబ్లీ హిల్స్ కు చెందిన ప్రముఖ వ్యాపారి మైనర్ కూతురిని కూకట్పల్లికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ట్రాప్ చేసి రూ.13 లక్షల వరకు వసూలు చేశాడు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ ఆజాద్తో పాటు ఆయన తల్లి మీనాకుమారి, తమ్ముడు రాజీవ్, మేనమామ తరక ప్రశాంత్, మీనాకుమారి స్నేహితుడు వినీలౌచౌదరిలతో పాటు మరికొందరు స్నేహితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చంద్రశేఖర్ ఆజాద్ ను రిమాండ్ కు తరలించారు. మిగతా వారందరినీ అరెస్టు చేశారు.

అయితే తన కూతురి జోలికి రావద్దని, డబ్బులు డిమాండ్ చేయవద్దని బాధితురాలి తండ్రి పలుమార్లు మీనాకుమారిని బతిమలాడారు. ‘నీ కూతురి జోలికి నా కుమారుడు రాకుండా ఉండాలంటే, నీ కూతురితో మావాడు తిరగవద్దనుకుంటే రూ.25 లక్షలు ఇవ్వాలంటూ’ మీనాకుమారి బాధిరాలి తండ్రిని డిమాండ్ చేసింది. మీనాకుమారి సోదరుడు ప్రశాంత్ కూడా పలుమార్లు బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుంటే నా మేనల్లుడు మీ అమ్మాయితో అలాగే తిరుగుతాడంటూ హెచ్చరించాడు. దీంతో బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మీనాకుమారితో పాటు ప్రశాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో యువతి ఫిర్యాదు..

సంపన్న యువతులను ట్రాప్ చేస్తూ యువతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ సోదరుడు రాజీవ్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో చీటింగ్ కేసు నమోదైంది. తనను ప్రేమ పేరుతో తిప్పుకుని తరచూ శారీరిక వాంఛలు తీర్చుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశాడని
నార్సింగ్ కు చెందిన ఓ యువతి తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read

Related posts