భార్య ఎప్పుడు పుట్టింటికి వెళ్తుందా.. ఎప్పుడు మనం రిలాక్స్ అవుతామా అని ఎదురుచూసే ఈ రోజుల్లో ఓ యువకుడు తన భార్యకోసం ఏకంగా రేడియో టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి కాపురానికి పంపడంలేదని టవరెక్కి ఇలా తన ఆవేదనను వెళ్లబోసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిపట్టణంలో జరిగింది. జిల్లాలోని చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన గొల్ల సురేంద్ర అనే యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న భారీ రేడియో టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. సురేంద్ర కర్ణాటకలోని జిందాల్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. నేమక్కల్ గ్రామానికి చెందిన నాగేశ్వరిని ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం పండగ కోసం భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అత్తింటి వారు తన భార్యను కాపురానికి పంపడం లేదని, ఈ విషయంలో ప్రశ్నిస్తే తనపైనే దాడులు చేస్తున్నారని సురేంద్ర వాపోయాడు. సమాచారం అందుకున్న రెండో పట్టణ సిఐ రాజశేఖర్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పై ఉన్న సురేంద్రతో సెల్ ఫోన్ ద్వారా సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి, అతనికి ధైర్యం చెప్పి కిందకు దిగేలా చేశారు. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న పోలీసులు, వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, సామరస్యంగా సమస్యను పరిష్కరించి పంపించారు. భార్య కోసం భర్త టవర్ ఎక్కిన ఈ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also read
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?




