భార్య ఎప్పుడు పుట్టింటికి వెళ్తుందా.. ఎప్పుడు మనం రిలాక్స్ అవుతామా అని ఎదురుచూసే ఈ రోజుల్లో ఓ యువకుడు తన భార్యకోసం ఏకంగా రేడియో టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి కాపురానికి పంపడంలేదని టవరెక్కి ఇలా తన ఆవేదనను వెళ్లబోసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిపట్టణంలో జరిగింది. జిల్లాలోని చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన గొల్ల సురేంద్ర అనే యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న భారీ రేడియో టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. సురేంద్ర కర్ణాటకలోని జిందాల్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. నేమక్కల్ గ్రామానికి చెందిన నాగేశ్వరిని ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం పండగ కోసం భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అత్తింటి వారు తన భార్యను కాపురానికి పంపడం లేదని, ఈ విషయంలో ప్రశ్నిస్తే తనపైనే దాడులు చేస్తున్నారని సురేంద్ర వాపోయాడు. సమాచారం అందుకున్న రెండో పట్టణ సిఐ రాజశేఖర్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పై ఉన్న సురేంద్రతో సెల్ ఫోన్ ద్వారా సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి, అతనికి ధైర్యం చెప్పి కిందకు దిగేలా చేశారు. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న పోలీసులు, వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, సామరస్యంగా సమస్యను పరిష్కరించి పంపించారు. భార్య కోసం భర్త టవర్ ఎక్కిన ఈ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





