SGSTV NEWS online
CrimeTelangana

నమ్మినవారే మోసం చేశారంటూ సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి… చివరికి ఏం జరిగిందంటే?





రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామపెద్దల సమక్షంలో జరిగిన భూమి విక్రయ ఒప్పందం మోసంగా మారి ఒక వికలాంగుడిని ఆత్మహత్యా ప్రయత్నానికి దారితీసింది. కొండాపురం బాబాయ్య అనే బాధితుడు తన భూమి ఒకరం 20 గుంటలను రూ. 1,30,000కి రిజిస్ట్రేషన్ చేసినా, కొనుగోలుదారులు డబ్బు చెల్లించకపోవడంతో అతడు గ్రామంలోని జియో సెల్ ఫోన్ టవర్‌పై ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. “నమ్మినవారే నట్టేట ముంచారు. అడిగితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు. చివరకు విసిగిపోయి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాను,” అని బాబాయ్య తన కష్టాన్ని వివరించాడు. భూమి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత దయాదులు మొండి వైఖరి చూపించడంతో మనస్తాపం చెందిన అతడు ఈ తీవ్ర చర్యకు దిగాడు.


సమాచారం తెలిసిన యాచారం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని బ్రతికించడానికి కృషి చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఆపరేషన్‌లో గ్రామ పెద్దల సహకారంతో దయాదులు డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాబాయ్య కిందకు దిగి వచ్చాడు. గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ధనం మూలం ఇదం జగత్ అనే నానుడికి ఇటువంటి సంఘటనలు అద్దం పడుతున్నాయి. పోలీసులు దయాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

Also read

Related posts