పదో తరగతి పరీక్షలు రాసి, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఓ యువకుడిని విధి వంచించింది. తండ్రిని సురక్షితంగా ఆటో ఎక్కించి పంపిన కొద్దిసేపటికే ఐస్క్రీం బండి రూపంలో మృత్యువు కబళించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.
జీవితం ఎంత విచిత్రమైనదో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. రెప్పపాటు కాలంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రయోజకుడవుతాడని ఆశించిన ఆ ఒక్కగానొక్క కుమారుడు.. కళ్లముందే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఆ విద్యార్థి, కనీసం ఆ ఫలితాలు కూడా చూడకుండానే అనంతలోకానికి వెళ్లిపోవడం స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది.
ముదిగుబ్బ మండలం దొరిగల్లు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఈ హృదయ విదారక ఘటనలో హైదర్బాషా (16) అనే యువకుడు మృతి చెందాడు. నల్లమాడ మండలం గోపేపల్లికి చెందిన చాంద్బాషా, సకీనా దంపతులు బతుకుదెరువు కోసం ఇందుకూరుకు వలస వచ్చారు. బుధవారం ముదిగుబ్బలో జరిగిన ఒక శుభకార్యానికి తండ్రీకొడుకులిద్దరూ వెళ్లారు. పని ముగించుకున్నాక, తండ్రిని ఆటో ఎక్కించి పంపిన హైదర్బాషా, తాను బైక్పై ఇంటికి బయల్దేరాడు. కానీ విధి మరోలా తలచింది. దారి మధ్యలో ఎదురుగా వస్తున్న ఐస్క్రీం బండిని ఢీకొట్టడంతో, ఆ బండికి ఉన్న ఇనుప రేకు మెడకు బలంగా తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే తండ్రితో కలిసి నవ్వుతూ గడిపిన ఆ పిల్లాడు, ఇప్పుడు లేడన్న వార్తను ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. ఒకేషనల్ సర్టిఫికెట్లు అందుకుని సంతోషంగా వస్తున్న తరుణంలో మృత్యువు పగబట్టినట్లు ఎదురొచ్చింది. సీఐ శివరాముడు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చేతికి అందిన కొడుకు అకాల మరణంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చదువుకుని గొప్ప స్థాయికి వెళ్తాడనుకున్న బిడ్డ, ఇలా రోడ్డు ప్రమాదంలో బలికావడం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్చేస్తే.. 3 నెలల తర్వాత..





