తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. అత్తాకోడళ్ళను హతమార్చిన మోహన్ అనే వ్యక్తి.. అనంతరం తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడంతో వెంకటకృష్ణపాలెంలో విషాదం నిండిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుపతి జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తనువు చాలించడంతో నారాయణవరం మండలం వెంకటకృష్ణపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న చిన్న కారణాలు లేదా మనస్పర్థలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే.. నారాయణవరంలో సిమెంట్ దుకాణం నిర్వహించే మోహన్ అనే వ్యక్తి.. తన తల్లి చంద్రకళ(65), భార్య హరిత(35)ను చున్నీతో గొంతు బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలైన కౌశిక్(9వ తరగతి), హిమాని (7వ తరగతి)లను తీసుకుని ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్ళాడు. ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్న అత్తాకోడళ్ళను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు రంగంలోకి దిగి మోహన్ కోసం గాలింపు చేపట్టగా, పుత్తూరు మండలం వేపగుంట క్రాస్ వద్ద రైల్వే ట్రాక్పై ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తన ఇద్దరు పిల్లలతో సహా మోహన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కుటుంబ కలహాలు లేదా మోహన్ మానసిక స్థితి సరిగా లేకపోవడమే ఈ సామూహిక మరణాలకు కారణమై ఉండొచ్చునని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారిస్తున్నారు. కళ్ళముందే తిరుగుతున్న కుటుంబం ఇలా చిన్నాభిన్నం కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్చేస్తే.. 3 నెలల తర్వాత..





