SGSTV NEWS online
CrimeTelangana

వర్తకులు, వ్యాపారులే వారి టార్గెట్… సేవ ట్రస్టులు, అనాథఆశ్రమాల పేరుతో బలవంతపు వసూళ్లు.



సేవ పేరుతో సొమ్ము దోచుకుంటున్న కేటుగాళ్ల గుట్టు రట్టు అయింది. అనాథాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ పేరుతో వ్యాపారులను బెదిరించి వేల నుంచి లక్షల వరకు వసూళ్లు చేసిన ముఠాను జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్‌పే నంబర్‌తో బయటపడిన మోసం… అసలు సేవ పేరులో దాగిన దోపిడీ కథ ఈ కథనంలో…

అక్రమార్జనే ధ్యేయంగా కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. సేవ ట్రస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమాల పేరుతో బలవంతంగా చందాలు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతు వర్తక, వ్యాపారులతో పాటు సామన్య ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బలవంతంగా చందాలు వసూళ్లకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.


సేవా ట్రస్టుల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదర్శ వెల్ఫేర్ అండ్ ఎడ్యూకేషనల్ సొసైటీ, అమ్మ నాన్న అనాథ సేవ ట్రస్టు పేరుతో పట్టణంలోని వర్తక, వ్యాపారులను టార్డెట్ చేసుకొని బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఒక్కో వ్యాపారి వద్ద కనీసం రూ. 5116 నుంచి రూ.25000వేల వరకు బలవంతంగా వసూళు చేశారు. సుమారు 15రోజులుగా జడ్చర్ల పట్టణంలోని వ్యాపారులనే నిందితులు లక్ష్యంగా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. అనాథాశ్రమంలో విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు వచ్చిందని రూ.50లక్షలు కావాలని మీ వంతు సహాయం అందించాలని ఒక్కో వ్యాపారి వద్ద చందాలు వసూళు చేశారు. కొంతమంది తాము అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడంతో వ్యాపారంలో లక్షలు సంపాదిస్తున్నారు… చచ్చేటప్పుడు వెంట కట్టుకుపోతారా అంటూ దబాయిస్తున్నారని బాధితులు చెప్పారు.

ఫోన్ పే వేరే నెంబర్ చెప్పడంతో అనుమానం:


అయితే ఓ కిరాణ వ్యాపారి వద్దకు వెళ్లి సేవా ట్రస్టుల పేరుతో చందాలు డిమాండ్ చేశారు. సుమారు లక్ష రూపాయాలు ఇవ్వాలని బలవంత పెట్టారు. తాను విద్య, భక్తి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఎలాంటి చందా ఇవ్వలేనని ముఠాకు తెలిపాడు. ఎంతో కొంత చివరకు రూ.5116 ఇవ్వాలని బెదిరించారు. దీంతో చేసేది లేక ఫోన్ పే ద్వారా చెల్లిస్తానని సదరు ట్రస్ట్ స్కానర్ చూపాలని కోరాడు. అయితే నిందితులు తమ ట్రస్ట్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని వేరే వ్యక్తి ఫోన్ పే నెంబర్ కు అమౌంట్ పంపాలని చెప్పారు. సదరు ట్రస్టు కు ఫోన్ చేసి కనుక్కోగ తాము ఎవరిని చందాల కోసం పంపలేదని తెలిపారు. దీంతో సదరు వ్యాపారి ట్రస్టుల పేరుతో మోసం చేస్తున్నారని ముఠా సభ్యులతో గట్టిగా మాట్లాడారు. ఎక్కడ తమ మోసం బయటపడుతుందోనని ఐదుగురు అక్కడి నుంచి కారులో పరారవుతుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొల్లాపూర్ కు చెందిన కొడగంటి నరసింహ, మల్కాజ్ గిరికి చెందిన మూడ నర్సయ్య, వనపర్తికి చెందిన సిరిగిరి శివశంకర్, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు కు చెందిన రమేశ్ , వనపర్తి జిల్లా పెద్దమందడి కి చెందిన బోయిని బందెన్న ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఒక కారును స్వాధినం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జడ్చర్ల పట్టణంలోనే సుమారు 50 మంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇదే తరహా ఇతర ప్రాంతాల్లోనూ బలవంతపు వసూళ్లకు పాల్పడ్డార అన్న వివరాలను వెలికితీసే పనిలో ఖాకీలు ఉన్నారు. సేవా కార్యక్రమాల పేరుతో అక్రమ వసూళ్ల ఎపిసోడ్ తెరమీదరకు రావడంతో ఉమ్మడి జిల్లాలోని వర్తక, వ్యాపారులే కాదు… సామాన్య ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Also read

Related posts