గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన మొండితోక తేజ ఈ నెల 23వ తేదిన విజయవాడ వచ్చాడు. విజయవాడలో పని ముంగించుకొని తిరిగి ఇంటి ముఖం పట్టాడు. ఈ క్రమంలోనే కనకదుర్గా వారధి దాటిన తర్వాత కరకట్టపై వెళ్లేందుకు వేచి ఉన్నాడు. అయితే ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండటంతో పాటు వాహనాల రద్దీ తక్కువుగా ఉంది. దీంతో లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులను అడగటం మొదలు పెట్టాడు.
కొద్దీ సేపటి తర్వాత ఇద్దరూ యువకులు ప్రయాణిస్తున్న బైక్ ఒకటి వచ్చి తేజ ముందు ఆగింది. ఎక్కడికి వెళ్లాలంటూ ఒక యువకుడు తేజాని అడిగాడు. వల్లభాపురం వెళ్లాలని తేజ చెప్పాడు. వెంటనే బైక్ పై వెనుక ప్రయాణిస్తున్న యువకుడు దిగి మధ్యలో తేజాను కూర్చోబెట్టి వెనుక తను కూర్చొన్నాడు. ముగ్గురు కలిసి కొద్దీ దూరం ప్రయాణించారు. అయితే కరకట్ట వైపు నుండి బైక్ ను క్రిష్ణా నదిలోకి వెళ్లే మార్గంలోకి మళ్లించారు. కేకలు వేయవద్దంటూ తేజను వెనుక కూర్చొన్న యువకుడు హెచ్చరించాడు.
క్రిష్ణా నదిలోని ఇసుక తెన్నెలపైకి తేజాను తీసుకెళ్లిన యువకులు అతని ఒంటిపై ఉన్న బంగారు చెయిన్, చేతికున్న ఉంగరాన్ని లాక్కున్నారు. అతని ఫోన్ పే నుండి ఆరు వేల రూపాయల నగదును మళ్లించుకొని తేజాను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. కొద్దీ సేపటి తర్వాత తేరుకున్న తేజ వెంటనే తాడేపల్లి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరా విజువల్స్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి యువకులను గుర్తించారు.
నిందితులు విజయవాడలోని రాణిగారి తోటకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు పరారు కాగా మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే తేజా వద్ద కొట్టేసిన బంగారు చెయిన్, ఉంగరాన్ని ఇప్పటికే అమ్మేసి ఆ డబ్బులను పంచుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో పరారయిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే కరకట్టపై ఒంటరిగా ప్రయాణించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు
Also read
- Money Astrology: రవి కటాక్షం.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
- అష్టమి నాడు కాలభైరవ పూజ ఎందుకు ప్రత్యేకం? దీపారాధన, శునకాలకు ఆహారం పెడితే కలిగే శుభాలివే
- గరుడ పురాణం చెప్పే మరణానంతర ప్రయాణం.. ఆత్మ దాటాల్సిన 16 నగరాలు, వైతరణి నది రహస్యం!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Andhra: పెళ్లై 40 రోజులే.. ఇంతలోనే ఏం జరిగింది..?





