SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..



పట్టపగలు.. బంగారు నగల షాపుకు స్కూటర్‌పై వచ్చాడు ఓ వ్యక్తి.. పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు.. బంగారం లేటెస్ట్ ధర ఎంత ఉంది.. ఇంకా వెయిట్ చేస్తే ధర ఇంకా తగ్గుతుందా.. 916 అయితేనే చూపండి..లేదంటే భవిష్యత్తులో నష్టం ఇలా మాటలు కలుపుతుంటే ఆ యజమాని కూడా ఊహించని ఘటన జరిగింది..


తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పట్టపగలే చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక బంగారు దుకాణంలోకి కస్టమర్‌లా వచ్చిన ఒక దుండగుడు, యజమాని కళ్లలో కారం కొట్టి లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సూళ్లూరుపేట నడిబజారులో ఉన్న శ్రీ వేంకటేశ్వర జ్యూవెలర్స్ వద్దకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక వ్యక్తి స్కూటర్‌పై వచ్చాడు. షాపులోకి ప్రవేశించిన ఆ వ్యక్తి, తనకు మంచి డిజైన్ల ఆభరణాలు కావాలని యజమాని వెంకటేశ్వర్లును అడిగాడు. యజమాని నగలు చూపిస్తుండగా, ఆ వ్యక్తి ప్రస్తుత మార్కెట్ రేట్లు, భవిష్యత్తులో ధరలు పెరుగుతాయా? అంటూ యజమానిని మాటల్లో దించి ఏమార్చాడు.


యజమాని ఏమరపాటుగా ఉన్న సమయంలో దుండగుడు తన బ్యాగులో తెచ్చుకున్న కారాన్ని తీసి ఒక్కసారిగా వెంకటేశ్వర్లు కళ్లలో కొట్టాడు. యజమాని తేరుకునేలోపే కళ్లముందు ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకుని స్కూటర్‌పై పరారయ్యాడు. ఈ దారుణమంతా షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. కళ్లలో కారం పడటంతో యజమాని ఆర్తనాదాలు చేయగా, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. సుమారు లక్షల విలువైన బంగారం అపహరణకు గురైనట్లు యజమాని చెబుతున్నారు. అయితే ఎంత మొత్తం బంగారం పోయింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ప్రజల్లో ఆందోళన
పట్టపగలు, జనం రద్దీగా ఉండే నడిబజారులో ఇలాంటి ఘటన జరగడంపై సూళ్లూరుపేట ప్రజలు, వ్యాపారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో దొంగతనాలు పెరుగుతున్నాయని, భద్రతను మరింత కఠినతరం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దుండగుడి కోసం గాలిస్తున్నారు

Also read

Related posts