సూర్యుడు, లేదా చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు మనం కొన్ని వస్తువులపై దర్భలను వేసి ఉంచడం అన్నది గ్రహణ నియమాలలో ప్రత్యేకించి చెప్పారు. మరి దర్భలనే ఎందుకు వేయాలి? దానికి గల ప్రాధాన్యత ఏంటో తెలుసుకోండి?
సాధారణంగా మనకు గ్రహణాలు వచ్చినప్పుడు వివిధ రకాల గ్రహణ నియమాలను చెబుతుంటారు. అందులో ముఖ్యమైనది వివిధ వస్తువులు, ఆహార పదార్థాలపై దర్భ గడ్డిని ఉంచడం. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా దర్భ గడ్డి వేయడం అనేది ప్రముఖంగా చెబుతున్నారు పండితులు. మరి కేవలం గ్రహణ సమయంలోనే దర్భ గడ్డి ఎందుకు వస్తువులపై వేస్తారు? అసలు దర్భలకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటీ?
Lunar Eclipse Astrology: మార్చి 3, మంగళవారం రోజున కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. దృక్ సిద్ధాంత పంచాంగం ప్రకారం ఇది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున, సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుంది. విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో కూడా దర్శనమివ్వనుంది.
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి తొలి వారంలో ఏర్పడనుండటంతో జ్యోతిష్య పండితులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం మార్చి 3, మంగళవారం రోజున కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. దృక్ సిద్ధాంత పంచాంగం ప్రకారం ఇది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున, సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుంది. విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో కూడా దర్శనమివ్వనుంది. ఈ సందర్భంగా గ్రహణం సమయాలు, దర్శన వ్యవధి, పాటించాల్సిన నియమాలు, పరిహారాలు తదితర వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ, గ్రహణ సమయంలో సాధారణంగా పాటించాల్సిన నియమాలను తప్పకుండా అనుసరించాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. మన దేశంలో గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి చంద్రోదయం ఉండదు. అయితే గ్రహణం ముగిసే సమయానికి చంద్రోదయం జరుగుతుంది. అందువల్ల దీనిని “గ్రస్తోదయ చంద్రగ్రహణం”గా వ్యవహరిస్తారు.
చంద్రగ్రహణ ప్రారంభం – ముగింపు సమయాలు
ప్రారంభం: మధ్యాహ్నం 3:21 గంటలకు
ముగింపు: సాయంత్రం 6:48 గంటలకు
మొత్తం వ్యవధి: 3 గంటల 27 నిమిషాలు
భారతదేశంలో చంద్రోదయం తర్వాత మాత్రమే గ్రహణం కనిపిస్తుంది కాబట్టి, అనేక ప్రాంతాల్లో ఇది సుమారు 25 నుంచి 40 నిమిషాల పాటు మాత్రమే దర్శనమిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య భారత ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే అవకాశముంది.
ఆలయాల మూసివేత
గ్రహణకాల నియమాల ప్రకారం పలు ప్రధాన ఆలయాలు మూసివేయబడతాయి. తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ఆలయాలు తిరిగి తెరుచుకుంటాయి.
గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు
గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోవడం మంచిదని సనాతన సంప్రదాయం చెబుతుంది.
మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం ముగించుకోవాలి.
ఇంట్లో ఉన్న ఊరగాయలు, పచ్చళ్లపై దర్భలు ఉంచాలి.
గ్రహణానికి ముందు, తరువాత పట్టు, విడుపు స్నానాలు చేయాలి.
గ్రహణం విడిచే సమయంలో సముద్రం లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదమని శాస్త్రోక్తం.
రాత్రి 7:30 తర్వాత స్నానం చేసి దైవారాధన అనంతరం భోజనం చేయవచ్చు.
ఏ రాశుల వారు గ్రహణం చూడకూడదు?
ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం సింహరాశిలో సంభవిస్తున్నందున సింహరాశి వారు గ్రహణాన్ని నేరుగా చూడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్రకిరణాలు తగలకుండా ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరం.
గ్రహణ పరిహారాలు
సింహ, కర్కాటక, మకర, కుంభ రాశుల వారు గ్రహణం మరుసటి రోజు ఆలయానికి వెళ్లి తెల్లని వస్త్రంపై బియ్యం పోసి దానిపై వెండి చంద్రబింబాన్ని ఉంచి, దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి దానం చేయడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. మిగిలిన రాశుల వారికి ఈ గ్రహణం మధ్యమ లేదా శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు.
దర్భల ఆవిర్భావం వెనుక ఉన్న పురాణగాధలు
దర్భలలో మూడు రకాల దర్భలున్నాయి. మామూలు దర్భ జాతి.. వాటిని అపరకర్మలలో, కుశ జాతి దర్భలను శుభకార్యాలలో, బర్హిస్సు జాతికి సంబంధించిన దర్భలను యాగాలలో, వివిధ రకాల క్రతువులలో వాడుతారు. అసలు ఈ దర్భలు ఎలా ఆవిర్భవించాయి? అనేదానిపై రకరకాల పురాణ గాధలున్నాయి. కూర్మ పురాణం ప్రకారం , కూర్మావతారంలో క్షీరసాగర మథనం జరిగేటప్పుడు విష్ణుమూర్తి తాబేలు రూపంలో మంధర పర్వతాన్ని మోస్తున్నప్పుడు, కూర్మం శరీరం మీద ఉండే వెంట్రుకలు.. సముద్రంలో పడిపోయి, ఒడ్డుకు కొట్టుకుని వచ్చి కుశముగా మారాయనీ, ఆ సమయంలో అమృతం చుక్కలు వాటిమీద పడడం వల్ల వాటికి అంత ప్రాధాన్యత ఏర్పడిందనీ అంటారు. ఇక వరాహపురాణం ప్రకారం అవి విష్ణుమూర్తి వెంట్రుకలని చెబుతారు. మరో కథ ప్రకారం ఇవి విశ్వామిత్రుడి సృష్టి అని కూడా ఉంది. అంతేకాదు ఈ దర్భలను ఎప్పుడుపడితే అప్పుడు కోయకూడదు కూడా. పుష్యమి నక్షత్రం, ఆదివారం రోజున వాటిని కోయడం చాలామంచిది. అలా వీలు కాని పక్షంలో మంచి రోజు చూసి కోస్తారు.
ప్రత్యేకించి గ్రహణ సమయంలోనే ఎందుకంటే
ఇంత పవిత్రత కలిగి ఉన్నందున వీటిని వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతుంటారు. ప్రత్యేకించీ ఈ గ్రహణ సమయంలోనే ఎందుకు వాడతారంటే, గ్రహణ సమయంలో సూర్యుడు, లేదా చంద్రుడు నుంచి కాస్మొటిక్ రేడియేషన్ వస్తుంది. దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంది. సాధారణంగా గ్రహణాలు ఏర్పడ్డప్పుడు వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పులు మనిషి శరీరంపైన శారీకంగానూ, మానసికంగానూ ప్రభావాన్ని చూపుతాయి. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నట్లుగానే చంద్రుడిని మనః కారకుడిగా చెబుతుంటారు. అలా సూర్య, చంద్రులిరువురూ మానవుని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తారన్నమాట. మరి గ్రహణ సమయంలో వారి శక్తి సన్నగిల్లుతుంది. ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే దర్భలను ఉపయోగించాలని చెబుతుంటారు. కొన్ని వస్తువులు, ముఖ్యంగా తినే పదార్థాలపై దర్భలను ఉంచినట్లయితే ఆ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని 1982-83 సంవత్సరాలలో సూర్యగ్రహణ సమయంలో చేసిన శాస్త్రీయ పరిశోధనల్లో రుజువైంది కూడా. ఇలా శాస్రీయపరంగానూ, సంప్రదాయపరంగానూ ఈ గ్రహణ సమయంలో దర్భలను వాడడం అతిముఖ్యమైనదిగా చెప్పవచ్చు.
Also read
- Chittoor: అతిగా జిమ్ చేసి బ్యాంక్ ఉద్యోగి మృ*తి
- Eluru Police: ఏలూరులో ‘నేను ఎవరో తెలుసా’ అంటూ దొంగల ఫ్లెక్సీలు కలకలం..
- Chandra Grahan 2026: చంద్రగ్రహణం తర్వాత స్నానం చేసి దానం చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
- ఎంత తాగావ్రా? పాపం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులుని ముప్పుతిప్పలు పెట్టాడు! వీడియో
- సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగిన దంపతులు.. ఇంతలోనే షాకింగ్ ఘటన!.





