పండగ వేళ బిహార్ లోని జరిగిన ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోగా, ఈ ప్రమాదం తరువాత స్థానికుల అమానవీయ ప్రవర్తన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన బిహార్ లోని సీతామర్హి జిల్లాలో, పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాఝిహట్ గ్రామం సమీపంలో జరిగింది.
ఏడో తరగతి విద్యార్థి రితేష్ కుమార్ అలియాస్ గోలు పొద్దున్నే ప్రైవేట్కు వెళుతున్నాడు. ఇంతలో వేగంగా దూసుకు వచ్చిన ఒక పికప్ ట్రక్కు అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొన్న ధాటికి, సమీపంలో ఉన్న వారు బెంబేలెత్తిపోయారు. కేకలు వేశారు. కొద్దిసేపటికే బాలుడి రితేష్ తండ్రి సంతోష్ దాస్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా మారిన బిడ్డను చూసి తీవ్ర దుఃఖంతో కుప్పకూలిపోయారు.
హృదయాల్ని మెలిపెట్టే దృశ్యాలు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్న మాటలకు అక్షర సత్యాలుగా నిలిచాయి. బాలుడిని ఢీకొట్టిన ట్రక్ చేపల్ని రవాణా చేస్తోంది. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్కులో చేపలు నిండి ఉన్నాయి, ప్రమాదం జరిగిన తర్వాత అవి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక పక్క విద్యార్థి తల్లిదండ్రులు దుఃఖంతో విలపిస్తోంటే, రోడ్డుకు అవతలి వైపు దృశ్యం చాలా భిన్నంగా ఉంది.
సహాయం అందించడానికి, అంబులెన్సు కు ఫోన్ చేయడానికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడానికి బదులుగా, సంఘటనా స్థలంలో గుమిగూడిన చాలా మంది చేపలను అందిన కాడికి దోచుకోవడం ప్రారంభించారు. చిన్నారి మృతదేహం సమీపంలోనే పడి ఉండగా, కొందరు వ్యక్తులు సంచులలో చేపలను నింపుకుని, మరికొందరు చేతులతో చేపలను పట్టుకుని పారిపోవడం విచారకరం.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పుప్రి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. రితేష్ మృతదేహాన్ని ఆధీనంలోకి తీసుకుని, పోస్ట్మార్టం కోసం పంపారు. ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్కును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





