నంద్యాలలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అపరిచితుడు ఇచ్చిన చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థినులు, ఒక టీచర్ అస్వస్థతకు గురయ్యారు. వారిలో వింత లక్షణాలు కనిపించడంతో డ్రగ్స్ కలపినట్లు అనుమానిస్తున్నారు. సమీపంలో మత్తు పదార్థాల కేంద్రం పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.
అపరిచితుడు ఇచ్చిన చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థినులు, ఒక టీచర్ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోంది. నందికొట్కూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినికి స్కూల్ బయట ఒక గుర్తుతెలియని వ్యక్తి ఒక చాక్లెట్ ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చాడు. ఆ బాలిక వాటిని స్కూల్లోని తన ఫ్రెండ్స్కు, పీఈటీ టీచర్కు ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
కనిపించిన షాకింగ్ లక్షణాలు
సాధారణ ఫుడ్ పాయిజనింగ్కు భిన్నంగా ఈ ఘటనలో బాధితుల్లో కొన్ని వింత లక్షణాలు కనిపించాయి. విద్యార్థినుల కనురెప్పలు నల్లగా మారిపోవడం. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, కొందరు విద్యార్థినులు మత్తులోకి జారుకోవడం వంటివి చోటుచేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది.
మత్తు పదార్థాల తయారీ కేంద్రంతో లింకు?
ఈ ఘటన వెనుక కేవలం పాడైపోయిన చాక్లెట్లు మాత్రమే లేవని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో నందికొట్కూరులో ఒక రహస్య మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడి చేసి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. విద్యార్థులను మత్తుకు బానిసలను చేయడానికి లేదా కొత్త రకమైన డ్రగ్స్ను పరీక్షించడానికి చాక్లెట్ల రూపంలో వీటిని సరఫరా చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోలీసుల వేట
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మిగిలి ఉన్న చాక్లెట్ నమూనాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపారు. ఆ చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆ విద్యార్థినిని ఎక్కడ కలిశాడు? అనే విషయాలపై CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలను, చాక్లెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని పిల్లలకు అధికారులు సూచించారు
Also Read
- డ్యామిట్ సీన్ రివర్స్.. లవర్పై పెట్రోల్ పోసి నప్పంటించే ప్రయత్నం.. కట్చేస్తే..
- Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్కు వచ్చాడు.. తీరా నగలు పరిశీలించగా
- సాయంత్రం వేళ స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2026
- కరీంనగర్ లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి




