SGSTV NEWS online
Andhra PradeshCrime

Tirupati Crime News: ఒకే  కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య



Tirupati Crime News: తిరుపతిలోని దామినేడు  ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తతో పాటు వారి రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. వారం రోజుల క్రితమే ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మూడు మృతదేహాలు పూర్తిగా కుళ్లిన స్థితిలో బయటపడటంతో సంఘటన తీవ్రత మరింత పెరిగింది.

స్థానికుల సమాచారం మేరకు, దామినేడు వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న భార్యాభర్త.. ఇటీవల కొన్ని రోజులుగా బయటకు కనిపించలేదు. ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో పొరుగువారు అనుమానం వచ్చి యజమానికి సమాచారం అందించారు. ఇంటి తలుపులు లోపల నుంచి మూసి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా, ఒకే గదిలో మూడు మృతదేహాలు పడి ఉండటంతో అక్కడున్నవారు షాక్కు గురయ్యారు.

భార్యాభర్తతో పాటు రెండేళ్ల చిన్నారి మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి.. దుర్వాసన వస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతులు వారం రోజుల క్రితమే ప్రాణాలు విడిచినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేసి, క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ ను కూడా రప్పించారు.

సమాచారం ప్రకారం.. కుటుంబం ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తిరుచానూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతుల ఫోన్ కాల్ డేటా, చివరి రోజు జరిగిన కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ పరిశీలిస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Also Read

Related posts