SGSTV NEWS online
Andhra PradeshCrime

Vizianagaram: పంటతో పాటు రైతును బలి తీసుకున్న మొంథా తుఫాన్..


తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిచోట్ల నష్టం మాత్రం తప్పట్లేదు. విజయనగరం జిల్లా వంగర మండలం కొండచారాపల్లి గ్రామంలో తుఫాన్ ప్రభావం విషాదాన్ని నింపింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈదురు గాలులు, భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇబ్బందికరంగా మారింది. కురుస్తున్న వర్షాలకు గాలులు తీవ్రత అధికంగా ఉండటంతో వెంకటరమణ అనే రైతు పొలంలో విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. అయితే కురుస్తున్న వర్షాల కారణంగా పొలంలో నీరు నిల్వ ఉండటంతో ఆ నీటిని పొలంలో నుంచి బయటకు పంపి తిరిగి ఇంటికి బయలుదేరాడు రైతు వెంకటరమణ. అయితే ఆ సమయంలోనే తెగిపడ్డ కరెంట్ తీగలు కాలుకు తగిలాయి. దీంతో కరెంట్ షాక్ తో ఒక్కసారిగా వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలారు. ఆయనను గమనించిన స్థానికులు వెంటనే పరుగెత్తి వెళ్లి సహాయం చేసినా అప్పటికే ప్రాణాలు వదిలాడు.

తుఫాన్ తాకిడితో ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతు కుటుంబం ఇప్పుడు కుటుంబసభ్యుడిని కోల్పోవడంతో శోకసముద్రంలో మునిగిపోయింది. వెంకటరమణ మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యుత్ శాఖ సిబ్బంది తీగలను తొలగించి మరమ్మతు పనులు ప్రారంభించారు. గ్రామస్తులు తుఫాన్ తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు తుఫాన్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు అధికారులు.

మరోవైపు తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు ఉద్యానవన పంటలు పెద్దఎత్తున నష్టపోయాయి. మరో 15 రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో భారీగా వీచిన ఈదురుగాలులకు వరి నేలకొరిగింది. పత్తి కుళ్ళిపోయింది. అరటి, బొప్పాయి చెట్లు నేలకూలాయి. రైతులు పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతున్న వాతావరణం ఉంది. చిన్న చిన్న కారు రైతులు తీవ్రంగా దెబ్బ తిన్నారు. స్తోమత గురించి అప్పులు చేసే పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే పంట చేతికి వచ్చేసరికి తుఫాన్ ప్రభావంతో నష్టపోవడం రైతులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Also read

Related posts