SGSTV NEWS online
Famous Hindu TemplesSpiritual

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వరుడి ప్రత్యేకత ఏంటి? నర్మదా తీరంలోని దివ్యక్షేత్ర విశేషాలు తెలుసా?


కార్తిక మాసంలో శివుడు స్వయంభువుగా వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించినా, స్మరించినా మోక్షం


Omkareshwar Temple History : శివపురాణం ప్రకారం శివుని ఢమరుక నాదం నుంచి వెలువడిన తొలి ధ్వని ‘ఓంకారం’ అని తెలుస్తోంది. సృష్టికి మూలమైన ఓంకారాన్ని సాక్షాత్తూ మహేశ్వరుని స్వరూపంగా భావిస్తారు. అందుకే శివుడు ఓంకారేశ్వరుడు అయ్యాడు. శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఓంకారేశ్వరుడుగా వెలసిన క్షేత్రమే ఓంకారేశ్వరం. కేవలం స్మరించినంత మాత్రాన్నే సకల పాపాలను పోగొట్టే ఈ ఓంకారేశ్వర క్షేత్రం ఎక్కడుంది? ఆ క్షేత్ర విశేషాలేమిటో తెలుసుకుందాం.

ఓంకారేశ్వర క్షేత్రం ఎక్కడుంది?

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగోది అయిన ఓంకారేశ్వర క్షేత్రం పవిత్ర నర్మదా నదీ తీరంలో వెలసి ఉంది. అయితే, ఈ క్షేత్రంలో గొప్ప విశేషముంది. ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా శివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర ప్రణవ లింగంగా, రెండోది మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది. అందుకే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఈ క్షేత్రాన్ని గురించి ‘ఓంకారమమలేశ్వరమ్” అని ప్రస్తావిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఓంకారేశ్వర క్షేత్రంలో శివుడు రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలందుకోవడం విశేషం.

ఓంకారేశ్వర క్షేత్రం విశిష్టత

అతి పురాతన జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్రం భక్తుల పాలిట ఇల కైలాసంగా విరాజిల్లుతోంది. ప్రధాన ఆలయంలో పరిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాళేశ్వర్, కేదారీశ్వర్, గుప్తనాథ్ పేరుతో వివిధ ఉపాలయాలున్నాయి. ఈ అయిదు ఆలయాలను కలిపి పంచలింగ ధామాలుగా పిలుస్తారు. నిత్యం పవిత్ర నర్మదా నదీ జలాలతో పునీతమయ్యే ఈ దివ్యధామాన్ని ఒక్కసారి దర్శించినా జన్మ ధన్యతగా భావిస్తారు. ఈ క్షేత్రంలో శివ దర్శనానికి ఒక పద్ధతుంది. ముందుగా ఓంకారేశ్వరుడిని, అనంతరం మమలేశ్వరుడిని దర్శించుకుంటే దర్శనఫలం దక్కుతుందని శాస్త్రవచనం.

ఆలయ స్థల పురాణం

పూర్వం అసురులు స్వర్గాన్ని ఆక్రమించుకుని దేవతలను హింసించసాగారు. ఆ సమయంలో స్వర్గాధిపతి ఇంద్రుడు శివుని ప్రార్ధించాడు. అప్పుడు జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడు పాతాళ లోకం నుంచి లింగాకారంలో వెలసి రాక్షసుల బారి నుంచి దేవతలను కాపాడి స్వర్గాన్ని తిరిగి దేవతలకు అప్పగిస్తాడు. శివుడు ఓంకారేశ్వరుడిగా వెలసిన చోట ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది.

త్రిపుర క్షేత్రం

నర్మదా నదీ తీరాన బ్రహ్మ, విష్ణువులు కూడా వెలసి ఉండడం వలన ఈ క్షేత్రానికి త్రిపుర క్షేత్రమని పేరు వచ్చింది. బ్రహ్మ వెలసిన క్షేత్రాన్ని బ్రహ్మపురి అని, విష్ణువు వెలసిన క్షేత్రాన్ని విష్ణుపురి అని అంటారు. పరమేశ్వరుడు వెలసిన క్షేత్రాన్ని రుద్రపురి అంటారు. ఈ రుద్రపురిలోనే మమలేశ్వర జ్యోతిర్లింగం ఉంది.

ఓంకార మాంధాత

పురాణాల ప్రకారం మాంధాతరాజు ఇంద్రుని అనుగ్రహంతో రాజ్యాధికారాన్ని స్వీకరిస్తాడు. ఈ మాంధాత ప్రతినిత్యం శివపూజ చేసే అపర శివ భక్తుడు. నర్మదా నది పవిత్ర జలాలు పర్వతాలపై నుంచి ఉరికి ప్రతి నిత్యం ఓంకారేశ్వరుని అభిషేకిస్తాయి. శివునిపై ఉన్న అచంచల భక్తి విశ్వాసాల కారణంగా మాంధాత తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. అందుకే ఈ ప్రాంతాన్ని ఓంకార మాంధాతగా పిలుస్తారు. ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ క్షేత్రంలో అగస్త్యుడు, అత్రి, విశ్వామిత్రుడు వంటి గొప్ప మహర్షులెందరో తపస్సు చేసారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

ఆలయ విశేషాలు

ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధాత నిర్మించగా తరువాతి కాలంలో వివిధ రాజ వంశస్థులు ఆలయాన్ని అభివృద్ధి చేసారు. రాజ వంశానికి చెందిన రాణి అహల్యా దేవి హోల్కర్ ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు జరిపించి ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఓంకారేశ్వరుని ఆలయ గోపురం ఒకవైపునకు ఒరిగి ఉంటుంది.

మమలేశ్వరుని క్షేత్ర విశేషాలు

ఓంకారేశ్వరుని దర్శించుకున్న భక్తులు నర్మదా నదికి ఆవలి ఒడ్డున ఉన్న మమలేశ్వరుని దర్శించుకుంటారు. గర్భాలయంలో మమలేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ స్వామినే అమలేశ్వరుడు అని కూడా అంటారు. ఈ ఆలయంలో కూడా అనేక ఉపాలయాలున్నాయి. ఇటు ఓంకారేశ్వరుని, అటు అమలేశ్వరుని దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమైందని భక్తులు భావిస్తారు.

పూజోత్సవాలు

ఓంకారేశ్వరుని క్షేత్రంలో, మమలేశ్వరుని క్షేత్రంలో ప్రతి ఏడాది శ్రావణ మాసంలో జరిగే శ్రావణ మేళా ఎంతో గొప్ప ఉత్సవం. ఈ సందర్భంగా ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు కొలువుదీరి నర్మదా నదిలో మేళతాళాల నడుమ జలవిహారం చేస్తారు. ఈ సందర్భంగా నది మధ్యలో ముమ్మారు ప్రదక్షిణాలు చేస్తారు. శ్రావణ మాసంలో చివరి సోమవారం రోజు జరిగే ఈ ఉత్సవాన్ని చూడటానికి దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు విచ్చేస్తారు. ఇక ఈ సందర్భంగా జరిగే ఉత్సవాలు కన్నులపండుగగా సాగుతాయి. ఇక కార్తిక మాసంలో శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. మాఘ మాసంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో శోభాయమానంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ క్షేత్రం భక్తజనసంద్రంగా మారుతుంది.

ఎలా చేరుకోవాలి?

మధ్యప్రదేశ్లోని ఇందోర్కు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమానం, రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఇందోర్ నుంచి ఓంకారేశ్వర క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు.

కేవలం స్మరించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే ఓంకారేశ్వర క్షేత్రాన్ని మనం కూడా దర్శిద్దాం. తరిద్దాం..

ఓం నమః శివాయ!

Also read

Related posts