Nalgonda baby selling: ఆధునిక యుగంలో ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నవ మాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ పసికందును విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పొత్తిళ్ళ నాడే తల్లి ప్రేమకు దూరమైన ఆ చిన్నారి ఎవరో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు, పార్వతి దంపతులు కూలి నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు మొదటి కాన్పులో బాబు జన్మించి తొమ్మిది నెలలకే చనిపోయాడు. ఆ తర్వాత రెండు, మూడు కాన్పుల్లో ఆడపిల్లల జన్మించారు. పది రోజుల క్రితం పార్వతి నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ దంపతతులకు ఈ సారి కూడా ఆడ బిడ్డే పుట్టింది. అయితే ముగ్గురు ఆడపిల్లలను సాకలేమని భావించిన బాబు, పార్వతి దంపతులు నాలుగో కాన్పులో జన్మించిన ఆడ శిశువును అమ్మకానికి పెట్టారు.
దళారుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి మూడు రోజుల క్రితం రూ. 3 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. ఆడ శిశు విక్రయంతో ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆడ శిశు విక్రయం కుటుంబంలో గొడవలకు దారితీసింది. దీంతో శిశువిక్రయం విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు బాబు పార్వతి దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తాము ఆడ శిశువును విక్రయించలేదని.. కేవలం సాకలేక దత్తత మాత్రమే ఇచ్చామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఐసిడిఎస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ వన్ టౌన్ పోలీసుల అదుపులో శిశువు తండ్రి బాబు ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి విక్రయానికి గురైన ఆడ శిశువును నల్లగొండకు తరలించేందుకు పోలీసులు, ఐసిడిఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Also read
- ఈ ఆలయంలో మీ ప్రశ్న నిజమైతే ‘శిల’ తిరుగుతుంది! – ‘శివాజీ’ యుద్దానికి వెళ్లేముందు ఇక్కడికి వచ్చేవారట!
- సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాల ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే!
- Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్
- మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం




