SGSTV NEWS
Telangana

సెలవులు ముగిసి స్కూల్‌కొచ్చిన విద్యార్ధులు.. క్లాస్‌రూమ్‌లో కనిపించింది చూడగా షాక్..!




అరచేతిలో టెక్నాలజీ, ఇంటర్నెట్‌తో ప్రపంచాన్నే దగ్గర చేసుకుంటున్న రోజుల్లో కొందరు మూఢనమ్మకాల బారిన పడుతూ క్షుద్ర పూజలను నమ్మడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తోంది. పాఠశాల ప్రాంగణంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురయ్యారు. శనివారం (అక్టోబర్ 4) ఉదయం జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపులో DSP కార్యాలయంకు కూతవేటు దూరంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిందీ ఘటన.



దసరా సెలవులు ముగిసి పాఠశాల తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ వరండాలో ముగ్గులు వేసి, పసుపు, కుంకుమ చల్లి, దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ దృశ్యాలు విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో భయాందోళన కలిగించింది. గతంలో ఒకసారి ఇదే పాఠశాలలో పావురాన్ని చంపి స్కూల్ గంటకు వేలాడదీసిన ఘటన జరగడం మూఢవిశ్వాసాల పరంపర కొనసాగుతున్నట్టు చూపుతోంది.

కంప్యూటర్ యుగంలోనూ విద్యాలయాలు సైతం ఇలాంటి ఘటనలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తుంది. పాఠశాలల్లో ఇలాంటి భయానక వాతావరణం నెలకొనడం విద్యార్థుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమంటున్నారు స్థానికలు. జిల్లా అధికారుల స్పందించి పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

Also read

Related posts