SGSTV NEWS
CrimeHealthNational

అలర్ట్.. ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. చిన్నారులకు వేయొద్దంటూ కేంద్రం కీలక ప్రకటన..



పేరెంట్స్‌..మీ పిల్లలకు దగ్గు మందు ఇస్తున్నారా? అయితే భద్రం బీకేర్‌ఫుల్‌. ఏ దగ్గుమందులో ఏముందో ఎవరికీ తెలియదు. కాఫ్‌ సిరప్పే అనుకుని లైట్‌గా తీసుకుంటే, ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. తమ పిల్లలకు దగ్గు తగ్గేందుకు, తల్లిదండ్రులు కాఫ్‌ సిరప్‌ ఇస్తే.. వాళ్ల ప్రాణాలే పోయిన ఘటనలు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో జరిగాయి. సో.. దగ్గుమందు విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.


దగ్గు మందు ప్రాణాలు తీస్తోంది.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది చిన్నారులు మరణించడం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా, రాజస్థాన్‌లోని భరత్‌పూర్, సికార్‌లలో ఇప్పటివరకు 12 మంది పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. ఈ మరణాలకు కారణం దగ్గు సిరప్ అని చెబుతున్నారు. ఈ పిల్లల మరణాలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఇంతలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిల్లలకు దగ్గు మందు గురించి ఒక సలహా జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక ముఖ్యమైన సలహా జారీ చేసింది. పిల్లలకు దగ్గు మందును చాలా జాగ్రత్తగా, పరిమిత పరిమాణంలో ఇవ్వాలని పేర్కొంది. దగ్గు – జలుబు ఉన్న చాలా మంది పిల్లలకు స్వయంగా తగ్గుందని.. మందులు అవసరం లేదని పేర్కొంది.. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దగ్గు – జలుబు మందు ఇవ్వకూడదని పేర్కొంది.


ఈ మందులు సాధారణంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇవ్వబడవని పేర్కొంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు క్లినికల్ పరీక్ష తర్వాత వైద్యుడు అవసరమని భావిస్తేనే మందులు ఇవ్వాలి. ఇది తక్కువ మోతాదులో, తక్కువ సమయం పాటు – అనవసరమైన మందులతో కలిపి చేయాలి. తగినంత హైడ్రేషన్, విశ్రాంతి, సహాయక సంరక్షణ వంటి గృహ, ఔషధేతర చర్యలకు పిల్లల సంరక్షణలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిత్వ శాఖ సిఫార్సు చేస్తుంది.

సురక్షితమైన మందులను మాత్రమే పిల్లలకు ఇవ్వండి..
అన్ని ఆసుపత్రులు, ఫార్మసీలు, ఆరోగ్య కేంద్రాలు పిల్లలకు మంచి తయారీ పద్ధతులు (GMP) కింద తయారు చేయబడిన సురక్షితమైన మందులను మాత్రమే కొనుగోలు చేసి అందించేలా చూసుకోవాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సలహాను ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCలు), జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు వ్యాప్తి చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర, జిల్లా ఆరోగ్య అధికారులను కోరింది.


ఆలస్యంగా వెలుగులోకి..

రాజస్థాన్‌లో గత రెండు వారాల్లో చోటు చేసుకున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సికార్‌ జిల్లాకు చెందిన 5 ఏళ్ల నితీశ్‌ దగ్గుతో బాధపడుతుండగా, సెప్టెంబరు 28న చిరానాలోని ప్రభుత్వాస్పత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు అతడికి సిరప్‌ను ఇచ్చారు. రాత్రి అది తాగి పడుకున్న నితీశ్‌ ఉదయం లేవలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇక మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో కలుషిత దగ్గు మందుల కారణంగా కేవలం పదిహేను రోజుల వ్యవధిలో ఏకంగా తొమ్మిది మంది చిన్నారులు కిడ్నీలు విఫలమై మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గతంలోనూ భారతీయ ఫార్మా కంపెనీలు తయారు చేసిన దగ్గు సిరప్‌ల వల్ల గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో చిన్నారులు మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద సరఫరా చేసే అన్ని మందులకు కఠినమైన ల్యాబ్ టెస్టులు తప్పనిసరి చేశారు. చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో… ఔషధ నాణ్యత నియంత్రణ విధానాలను పునస్సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది.

మధ్యప్రదేశ్‌లో పిల్లల మృతికి కారణమైనా కోల్డ్‌ రిఫ్‌ కాఫ్‌ సిరప్‌ కంపెనీలో డ్రగ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. తమిళనాడులోని కాంచీపురం దగ్గర ఉన్న ఈ కంపెనీలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చాకే చిన్నారుల మృతికి కారణాలు తెలుస్తాయంటున్నారు మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా.

చిన్నారుల మరణానికి కారణమైన కాఫ్‌ సిరప్‌లు ఎందుకు డెడ్లీగా మారాయి. నిపుణులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో చూడండి..

👉  పిల్లలకు కోల్డ్‌రిఫ్, నెక్స్‌ట్రో సిరప్‌లు వాడినట్లు గుర్తింపు

👉  దగ్గుమందు కలుషితం అయి చిన్నారుల కిడ్నీలు విఫలమయ్యాయని అనుమానం

👉  డెక్స్ట్రో మెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ ఉన్న కాఫ్ సిరప్‌లే..

👉  ఈ మరణాలకు కారణమని నిపుణుల అనుమానం..

Also read

Related posts