SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఊరు కాని ఊరు వచ్చారు.. తల్లిదండ్రులను ఎదిరించి.. చిన్న విషయానికే ఇలా చేస్తారా..

హైదరాబాద్ నగరంలోని రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు (అక్కాచెల్లెళ్లు) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, ఉదయగిరి గ్రామానికి చెందిన కుటుంబం గత నెల బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చారు.. ఈ క్రమంలో బాలాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. పెద్ద కుమార్తె వినీలా (17).. చిన్న కుమార్తె అఖిల (16) ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె మూడు నెలల క్రితం ఓ యువకుడిని ప్రేమించి అతనితో ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు పెద్దలను సంప్రదించడంతో పంచాయితీ పెట్టారు. వయస్సు లేదని.. కులాంతర వివాహం వద్దని పెద్దల సమక్షంలో అమ్మాయికి నచ్చజెప్పి తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.


అప్పటి నుంచి ఇంట్లో గొడవలు అవుతున్నాయి.. ఈ క్రమంలో ఇద్దరు అమ్మాయిలు తమ మాట వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిండటంతో.. తల్లిదండ్రులు వారిని మందలించారు. దీంతో వినీలా, అఖిల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ రెయిలింగ్ కు చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు

Also read

Related posts

Share this