March 12, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: వామ్మో.! వీళ్లు మహాఘనులే.. ఈజీ మనీ కోసం ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..



ప్రకాశంజిల్లా బేస్తవారిపేటలో అటవీశాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడి తమ దగ్గర నుంచి 3.28 లక్షలు కాజేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం మండలం వేములకోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన కిషోర్, రాజేష్‌ రైస్ పుల్లింగ్ సంబంధించిన రాగి వస్తువు..


ప్రకాశంజిల్లా బేస్తవారిపేటలో అటవీశాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడి తమ దగ్గర నుంచి 3.28 లక్షలు కాజేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం మండలం వేములకోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన కిషోర్, రాజేష్‌ రైస్ పుల్లింగ్ సంబంధించిన రాగి వస్తువు కొనుగోలు విషయంలో సంప్రదించారు. దీన్ని అమ్మితే కోట్ల రూపాయల డబ్బులు సంపాదించవచ్చని సాయికుమార్‌ను నమ్మించారు. బేస్తవారిపేటకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తిని మార్కాపురంలోని కుంట ప్రదేశానికి తీసుకువచ్చి సాయి కుమార్‌కు రైస్ పుల్లింగ్ రాగి వస్తువు వీడియోను మొబైల్‌లో చూపించారు. 3 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తే మార్కెట్లో కోట్లకు అమ్ముకోవచ్చని సాయికుమార్‌కు కిషోర్, రాజేష్, రామకృష్ణ నమ్మబలికారు. ఇక ఇక్కడి నుంచి అసలు కధ మొదలైంది.


రైస్‌ పుల్లింగ్‌ చేసే రాగి వస్తువును కొనుగోలు చేస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చని నమ్మిన సాయికుమార్‌ ఈ విషయాన్ని కనిగిరికి చెందిన తన స్నేహితుడు రామకృష్ణకు తెలిపాడు. ఇద్దరూ కలిసి రైస్‌ పుల్లింగ్‌ రాగి వస్తువును 3 లక్షలకు కొనుగోలు చేసేందుకు డబ్బులు రెడీ చేసుకున్నారు. బకరా దొరకాలే గానీ వేసేయడానికి కసాయివాళ్ళు రెడీగా ఉంటారు కదా. ఈ గోల్‌మాల్‌ వ్యవహారంలో సూత్రధారులైన మార్కాపురానికి చెందిన కిషోర్‌, రాజేష్‌ హైదరాబాద్‌కు చెందిన కేటుగాళ్ళను రంగంలోకి దించారు. బేస్తవారపేట మండలం పందిళ్ళపల్లి దగ్గర డీల్‌ సెటిల్‌ చేసుకునేందుకు నిర్ణయించారు. పందిళ్ళపల్లి సమీపంలో డీల్‌ మాట్లాడుతుండగా కొద్దిసేపటికి నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటూ వారిని గద్దించారు.

సాయికుమార్‌, రామకృష్ణ దగ్గర ఉన్న 2.80 లక్షలను లాక్కుని ఎవరికైనా చెబితే కేసు నమోదు చేస్తామని బెదిరించారు. ఇంతకూ మీరెవరని ప్రశ్నిస్తే అటవీశాఖ అధికారులం అంటూ దబాయించారు. అందుకు తగ్గట్టుగా నిందితులంటూ సాయికుమార్‌, రామకృష్ణలతో పాటు కిషోర్‌, రాజేష్‌ల ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే జైలుకు పంపిస్తామని బెదిరించారు. ఇంకా నగదు కావాలని వారిని బెదిరించి 48 వేలు ఫోన్ పే చేయించుకున్నారు.


అనంతరం రాచర్ల మండలంలో కొద్దిసేపు కారులో తిప్పి కంభం మండలం తురిమెళ్ళ మీదుగా మళ్లీ బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి టోల్ ప్లాజా దగ్గరకు తీసుకువచ్చి విడిచిపెట్టారు. వెళ్ళిపోతూ ఎవరికైనా చెబితే ఇబ్బందులు పడతారని, జైలుకు పోతారని మరోసారి బెదిరించారు. అంతా అయిపోయిన తరువాత బాధితులు ధైర్యం తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించారు. తమను అటవీశాఖ అధికారుల పేరుతో కొంతమంది బెదిరించి 3.28 లక్షలు దోచుకున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం డబ్బులు దోచుకుంది అటవీశాఖ అధికారులా, లేక ఇతర వ్యక్తులా అన్న పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share via