సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో మెట్ల రెయిలింగ్ నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతిచెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది.
బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో ఘటన
జహీరాబాద్ అర్బన్,: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో మెట్ల రెయిలింగ్ నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతిచెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్సై రాజేందర్రెడ్డి, గురుకుల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… జహీరాబాద్లోని జమాల్ కాలనీకి చెందిన సాధియా మెహరీన్(14) పట్టణ శివారులోని గురుకులంలో 9వ తరగతి చదువుతోంది. శనివారం రాత్రి స్టడీ అవర్ అనంతరం నమాజు చేసేందుకు భవనం మొదటి అంతస్తుకు వెళ్లింది. నమాజు పూర్తి చేసుకొని కిందకు దిగివస్తూ మెట్ల రెయిలింగ్ నుంచి జారిపడిపోవడంతో తల, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది బాలికను వెంటనే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. గురుకులంలో ఘటనా స్థలాన్ని సీఐ శివలింగం సందర్శించారు. విద్యార్థిని తండ్రి మహ్మద్ ఆసిఫ్ ఇచ్చిన
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గురుకులం ప్రాంగణంలో ప్రిన్సిపల్ సహా ఉపాధ్యాయులకు నివాస గృహాలున్నప్పటికీ.. స్థానికంగా ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. వారు సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోతుండటంతో విద్యార్థినులపై పర్యవేక్షణ కొరవడిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలికలు తరచూ మెట్ల రెయిలింగ్పై సరదాగా జారుతుంటారని, ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.
Also Read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!
.





