తరాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. స్వాతంత్ర దినోత్సవం వేళ అల్లూరి జిల్లాలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. అనారోగ్యంతో మృతిచెందిన మహిళ మృతదేహాన్ని నాలుగు కిలోమీటర్లు డోలి మోశారు. మృతదేహానికి డోలి కట్టి భుజాలపై మోస్తూ రాళ్లు రప్పలు దాటుకుంటూ ముందుకు సాగారు ఆ గిరిజనులు. అంతటి కన్నీటి కష్టంలోనూ.. దుఃఖాన్ని దిగమింగుకుని అడుగులు వేశారు. పాలకులు అధికారుల తీరుపై ఆవేదన చెందుతూ.. తమ కష్టాలు తీరేదేన్నడూ అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు ఆ అడవి బిడ్డలు.
అల్లూరి జిల్లా ఏజెన్సీలో గిరిజనుల కన్నీటి కష్టాలు తీరడంలేదు. పెదబయలు మండలం కుంబుర్ల గ్రామానికి చెందిన గంగమ్మ అనే మహిళ ప్రాణాలు విడిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న గంగమ్మ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రి నుంచి పెదబయలు మండలం కొత్తూరు వరకు అంబులెన్స్ లో మృతదేహం తరలించారు. అక్కడ నుంచి కుబుర్లకి రోడ్డు సదుపాయం లేకపోవడంతో.. కొత్తూరు నుంచి కుంబుర్ల వరకు మృతదేహానికి డోలి మోత మోశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదంటూ వీడియోలో గిరిజనుల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. తమ కష్టాలు తీరడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది గిరిజనులు సోషల్ మీడియాలో ఈ వీడియోను పెట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా తమ పట్ల కనికరం చూపాలని వేడుకుంటున్నారు.
Also read
- గల్ఫ్లో తెలుగు యువతి ఆత్మహత్య..
- నా భార్య నాకు కావాలని సెల్ ఫోన్ టవర్ ఎక్కిన భర్త..
- గిరిజనులకు తప్పని డోలీ మోతలు.. గర్భిణితో రెండు కిలోమీటర్ల నడక!
- సొంతింటికే నిప్పు పెట్టాడు.. అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు.. ఎందుకో తెలిస్తే..
- Hyderabad: తల్లికొడుకుల మాస్టర్ ప్లాన్.. టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్గా..





