June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

వైకాపా గెలుస్తుందని రూ.30 కోట్ల పందెం.. ఓటమితో సొమ్ము చెల్లించలేక ఆత్మహత్య



సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని సుమారు రూ.30 కోట్ల పందెం వేసి తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో  జరిగింది

నూజివీడు రూరల్, : సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని సుమారు రూ.30 కోట్ల పందెం వేసి తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచి. వీరు వైకాపా మద్దతుదారులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని వేణుగోపాలరెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకు పందెం వేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడం.. గ్రామంలో లేకపోవడంతో ఈ నెల 7న పందెం వేసినవారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటిరోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగు మందు తాగారు. మృతదేహం వద్ద ఓ లేఖను ‘ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా  తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్లు మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read

Related posts

Share via