SGSTV NEWS online
CrimeTelangana

Balcony Collapse: పంజాగుట్ట లో విషాదం.. శ్రీవాత్స అపార్ట్మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మృతి


Balcony Collapse: పంజాగుట్ట పోలీస్ స్టేషన్
పరిధిలోని కుందన్బాగ్లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీవాత్స అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, అపార్ట్మెంట్ యజమాని పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఎలక్ట్రిషియన్లుగా పనిచేసే తండ్రీకొడుకులు దేవిదాస్, వివేక్ గా పోలీసులు గుర్తించారు.

అపార్ట్మెంట్ యజమాని ద్వారక ప్రసాద్ తన నివాసంలోని మూడవ అంతస్తులో బాల్కనీని ఐరన్ రాడ్లతో పొడిగించి నిర్మాణం చేపట్టారు. ప్రమాద సమయంలో ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం వచ్చిన దేవిదాస్, వివేక్లు యజమానితో కలిసి ఆ కొత్త బాల్కనీలో కూర్చొని మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఆ ఐరన్ రాడ్ల స్లాబ్ విరిగి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో వివేక్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన దేవిదాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ప్రస్తుతం యజమాని ద్వారక ప్రసాద్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిర్మాణ లోపాలు లేదా అక్రమ పొడిగింపులే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts