• వీడిన హత్య కేసు మిస్టరీ
• ఐదుగురు నిందితులకు రిమాండ్
• వివరాలు వెల్లడించిన ఇన్చార్జి ఏసీపీ కృష్ణయ్య
మీర్పేట: పాత నేరస్తుడి హత్యకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మీర్పేట పోలీస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జి ఏసీపీ కృష్ణయ్య వివరాలు వెల్లడించారు. నందనవనానికి చెందిన ప్రధాన నిందితుడు దాసరి సురేందర్ అలియాస్ సూరి (29) వృత్తిరీత్యా కారు డ్రైవర్. మృతుడు సల్మాన్తో కొంత కాలంగా పరిచయం ఉండడంతో పాటు ఇద్దరూ కలిసి గతంలో పలు నేరాలకు పాల్పడడంతో పీడీయాక్ట్ నమోదై జైలుకు సైతం వెళ్లి వచ్చారు. సురేందర్ 2021లో సల్మాన్ సోదరి సభా ఫాతిమాను కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసుకోవడంతో పోలీసులు అతనిపై పోక్సో, రేప్ కేసు నమోదు చేసి 80 రోజుల రిమాండ్ విధించారు.
జైలు నుంచి బయటకు వచ్చిన సురేందర్ మతం మార్చుకుని మొయిన్ మునీర్ గా పేరు మార్చుకుని సల్మాన్ సోదరిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె జన్మించింది. 2022లో సురేందర్ భార్య ఫాతిమాను హత్య చేయడంతో ఎల్బీనగర్ పోలీసులు అతనిపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సల్మాన్ సోదరి (కజిన్) మంచాల స్వర్ణలతతో చనువుగా ఉంటున్నాడు. తన సోదరిని వివాహం చేసుకుని హత్య చేయడంతో పాటు మరో సోదరితో చనువుగా ఉండడాన్ని గమనించిన సల్మాన్ సురేందర్పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హతమారుస్తానని స్నేహితులతో చెప్పగా విషయం సురేందర్కు తెలియడంతో అతనే ముందుగా సల్మాన్ను హత్య చేసేందుకు పథకం వేశాడు.
దీనికి స్వర్ణలత, పాత నేరస్తులైన స్నేహితులు బొర్రా అరుణ కుమార్, దుగాని లక్ష్మణ్, కేతావత్ అరుణ్ సహకరిస్తామని చెప్పారు. ఈ నెల 8న నందిహిల్స్లోని స్నేహితుడి ఇంట్లో ప్లాన్ వేశారు. పథకం ప్రకారం ఆర్థిక లావాదేవీల సమస్యను పరిష్కరించుకుందామని స్వర్ణలతను ఎరగా వేసి రాత్రి 11.30 గంటలకు సల్మాన్కు ఫోన్ చేసి టీకేఆర్ కమాన్ సమీపంలోని అయ్యప్ప దేవాలయం వద్ద నిర్జన ప్రదేశంలోకి పిలిపించారు.
సల్మాన్ రాగానే సురేందర్తో పాటు మరో ముగ్గురు కత్తులతో పొడిచి హత్య చేశారు. ప్రధాన నిందితుడు సురేందర్తో పాటు స్వర్ణలత, మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సురేందర్పై పలు పోలీస్టే స్టేషన్లలో 39 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి రెండు కత్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్, డీఐ గౌరీనాయుడు, ఎస్ఐలు గోవిందస్వామి, సుధాకర్, సిబ్బంది ఎల్లయ్య, నగేష్, శివరాజు, అనిల్ రాజు పాల్గొన్నారు.